తెలంగాణలో రాజకీయాలు రోజుకో రకంగా హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ కు ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. 2019 ఎంపీ ఎలక్షన్స్ లో కవిత ఓటమి, దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పుంజుకుని టీఆర్ఎస్ హవాను తగ్గించేయడం.. ఈ సంఘటలన్నీ టీఆర్ఎస్ కు మింగుడుపడనివే. విపక్షాలను బలహీనం చేయడం ద్వారా బలపడాలని భావించిన టీఆర్ఎస్ కు ఇన్నాళ్లూ కలిసొచ్చినా.. ఇప్పుడు బీజేపీ రూపంలో బ్రేక్ పడింది. నిజానికి బీజేపీ ఇచ్చిన ఝలక్కులు టీఆర్ఎస్ కు ఇప్పటికిప్పుడు డ్యామేజ్ చేసేవి కావు. కానీ.. తెలంగాణలో ఈ మూడు సందర్భాల్లో బీజేపీ తెలంగాణలో తమ మాటే వేదంగా దూసుకుపోతున్న అధికార టీఆర్ఎస్ కు చెమటలు పట్టించింది. ప్రజల్లో ఆలోచన కలిగించింది. అయితే.. ఇంత ఇంపాక్ట్ సాధించిన బీజేపీ అప్పుడే విజయాల్ని తలకెక్కించుకుంటుందా.. నియంతృత్వ ధోరణి పెరుగుతోందా.. తప్పటడుగు వేస్తుందా..? అనే సందేహాలు వస్తున్నాయి.
బండి సంజయ్ కు సవాల్..!
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో పంచకల్యాణిలా దూసుకెళ్తోంది ఆ పార్టీ. విజయాలు వచ్చాయి. ప్రజల్లో ఆదరణా పెరిగింది. అయితే.. కొందరు నాయకుల అంతర్గత పోరు పార్టీ అధ్యక్షుడికి తలనొప్పులు తీసుకొస్తున్నాయి. ఇదంతా ఇతర పార్టీల నాయకులను బీజేపీలోకి తీసుకొచ్చే క్రమంలో బీజేపీకి క్రియాశీలకంగా ఉన్న ఇద్దరు అగ్ర నాయకుల వ్యవహారం తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతోంది. బీజేపీలో, స్థానిక నాయకత్వంలో, పార్టీ కార్యకర్తల్లో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ మారింది. ఈ ఇద్దరు నాయకులు రాష్ట్ర నాయకత్వం వద్ద తమ ఆధిపత్యం చూపేందుకు ఆరాటపడుతున్నారు. ఇది బీజేపీకి మంచిది కాదు అనే అభిప్రాయం వస్తోంది. వికారాబాద్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్ ను బీజేపీలోకి రప్పేంచేందుకు ప్రయత్నాలు జరిగాయి. బండి సంజయ్ కు సన్నిహతంగా ఉండే ఒక నాయకుడు శివశంకర్ ను ఒప్పించినట్టు సమాచారం. సంక్రాంతి తర్వాత చేరిక ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీనిన మరో బీజేపీ సీనియర్ నాయకుడికి నచ్చడం లేదు.
ఇద్దరూ అక్కడినుంచే వచ్చినా..
నిజానికి ఈ ఇద్దరు బీజేపీ నాయకులు గతంలో ఒక పార్టీ నుంచి వచ్చిన వారే. ఇప్పుడు బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం వద్ద తమకంటూ ఒక గుర్తింపు.. రాష్ట్రంలో బీజేపీ అగ్ర నాయకులుగా కూడా గుర్తింపు పొందారు. వీరిలో బండి సంజయ్ కు సన్నిహితంగా ఉన్న నేత ఇప్పుడు చంద్రశేఖర్ ను కాంగ్రెస్ నుంచి బీజేపీకి రప్పిస్తున్నారు. చంద్రశేఖర్ బీజేపీలోకి రావడం మరో సీనియర్ బీజేపీ నేతకు నచ్చడం లేదు. అందుకే ఆయనను ఆహ్వానిస్తున్న బీజేపీ నేతపై ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. ఇటివలి సమావేశాల్లో దీనిని వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. ఆయన వల్ల పార్టీకి ఉపయోగం ఉండదని వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. చంద్రశేఖర్ రాకపై స్థానిక బీజేపీ నాయకత్వానికి అభ్యంతరం లేదని అంటున్నారు. చంద్రశేఖర్ ను బీజేపీలోకి ఆహ్వానిస్తున్న నేత.. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని అంటున్నారు. బండి సంజయ్.. చంద్రశేఖర్ రాకను వ్యతిరేకిస్తున్న బీజేపీ సీనియర్ నేత ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. మరి.. ఈ విషయంలో ఇక్కడితో సమసిపోతుందో లేదో చూడాలి. అయితే..
బీజేపీ పుంజుకోవాల్సిన ఈ సమయంలో..
ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో ఇంకా బలపడాల్సిన పరిస్థితుల్లో లేని తలనొప్పులు, ఒంటెద్దు పోకడలు, నియంతృత్వ ధోరణలు, అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి సరికావు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇంకా బలపడాల్సి ఉంది. ప్రజలకు బీజేపీపై మరింత నమ్మకం కూడా కలిగించాల్సి ఉంది. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ ఇద్దరు బీజేపీ సీనియర్ నేతల అంశం.. త్వరగా సమసిపోయేలా చూడటం ఇప్పుడు బండి సంజయ్ బాధ్యత. ఇన్నాళ్లూ టీఆర్ఎస్ ఎదిగింది అంటే.. అంతర్గత కుమ్ములాటలు లేవు. ఉన్నా బయటకు కనిపించ లేదు. అంతా కేసీఆర్ కనుసన్నల్లో నడిచాయి. కేటీఆర్ – హరీశ్ రావు అంశం కూడా గాసిప్ లా ఉండేలా చూసుకున్నారు తప్పించి ఎక్కడా మళ్లీ బయటకు రాలేదు. బీజేపీ ఇంకా ఎదగాలంటే ఇలాంటి ట్రిక్స్ చేయాలి. ప్రజల్లో ఆ పార్టీ బలమైనదిగా.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారాలంటే బండి సంజయ్ ఇటువంటి విషయాలకు చెక్ పెట్టాల్సి ఉంది.