రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. విజయం, కీర్తి, ప్రజాదరణ, పదవి.. ఇలా ఒకదాని వెంట ఒకటి వరిస్తాయి. ఒక్కోసారి వీటికి వ్యతిరేక ఫలితాలు కూడా వస్తాయి. అన్నింటికీ తట్టుకుని నిలబడితే పూర్వపు స్థితి సాధిస్తారు.. లేదంటే కనుమరుగవుతారు. పాలిటిక్స్ లో ఈ రెండు తరహా వ్యక్తులు ఉంటారు. వీరిలో మొదటి కేటగిరీ నుంచి ఇప్పుడు రెండో కేటగిరీలోకి వచ్చిన రాయలసీమ నేత ‘బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి’. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రముఖ నేత. నియోజకవర్గాన్ని శాసించిన వ్యక్తి. ఉమ్మడి ఏపీ సమయంలో బైరెడ్డి పేరు మోగిపోయేది. రాష్ట్ర విభజన సమయంలోనూ.. విడిపోయాక కూడా వార్తల్లో నిలిచిన బైరెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
జయాపజయాలు ఆయనకు కొత్త కాదు..
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వరుసగా 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి తిరుగులేని విజయాలు సాధించారు. ఆ తర్వాత సరిగ్గా పదేళ్ల తర్వాత.. 2004, 2009 ఎన్నికల్లో వరుస ఓటములు చూశారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు, గెలుపోటములు.. ఆయనకు కొత్త కాదు. గెలిచినప్పుడు పొంగిపోలేదు.. ఓడిపోయినప్పుడు కుంగిపోలేదు. తృటిలో మంత్రి పదవి చేజారినా ఆయన నిబ్బరంగానే ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన స్థాయి, పార్టీలో గౌరవం, ప్రజల్లో ఆయన ఖ్యాతి ఏమాత్రం తగ్గలేదు. ఫ్యాక్షన్ మూలాలున్నా తన చేతికి మట్టి అంటకుండా.. తనపై హత్యాయత్నం చేసిన ప్రత్యర్ధుల్ని చిత్తు చేశారు. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించి జీవిత ఖైదు పడేలా చేశారు. అయితే..
మళ్లీ పుంజుకుంటారా..!
వరుస ఓటముల తర్వాత రాష్ట్ర విభజన వద్దంటూ రాయలసీమకు జరిగే నష్టంపై ఒంటరిగా గెంతెత్తి పోరాడారు. టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో ఇమడలేక రాయలసీమ పరిరక్షణ సమితి అని పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్ర నినాదమూ ఎత్తుకున్నారు. కానీ.. ఆయన వాదన అరణ్యరోదనే అయింది. రాష్ట్రం విడిపోయిన తరవాత చురుగ్గా రాజకీయాల్లో కొనసాగలేదు. ఇప్పుడు బైరెడ్డి బీజేపీలో ఉన్నారు. కానీ.. గత ప్రాభవం లేదు. వైఎస్ హవాలో కూడా తన మార్క్ నిలబెట్టుకున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుత రాజకీయాలకు ఇమడలేకపోతున్నారా.. అంటే ఆయన స్థాయికి అది తగదు అనే చెప్పాలి. మరి బైరెడ్డి మళ్లీ పుంజుకుంటారా.. లేదా అనేది ఆయన మాత్రమే చెప్పాలి.