(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
వైద్యో నారాయణో హరిః అంటే వైద్యుడు నారాయణుడు (భగవంతుడు)తో సమానం అని అర్ధం. వైద్యుడికి కులము, మతము, ప్రాంతము అనే భేదం ఉండదు. ప్రస్తుత కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న నివారణ చర్యలకు ప్రైవేట్ వైద్యులు తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ఎంతయినా వుంది. ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు స్వచ్ఛందంగా క్వారంటైన్ సేవలు అందిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్రంలో కొద్ది మంది ప్రైవేట్ వైద్యులు మాత్రమే స్వచ్చందంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. లాక్ డౌన్ అమలు అవుతున్న నాటి నుండి కరోనా వైరస్ ఎవరి నుండి అంటుకుంటుందేమో అన్న భయంతో చాలా మంది ప్రైవేట్ వైద్యులు ఆసుపత్రులను మూసివేసి ఇళ్లకే పరిమితం అయ్యారు.
ప్రతి జిల్లా కేంద్రంలో సగటున 100… జిల్లా మొత్తం కలుపుకుంటే 200 ప్రైవేట్ ఆస్పత్రులు ఉంటాయి.
కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకున్నది. ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రస్తుతం ఓపి సేవలు పూర్తిగా నిలుపుదల చేశారు. పలు ప్రైవేట్ ఆసుపత్రులలో మాత్రమే ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. వైద్య సేవలకు అత్యధికులు ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు.
ప్రైవేట్ వైద్యులకు అమంచి సున్నిత హెచ్చరిక
ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి అమంచి కృష్ణ మోహన్ ఈ సందర్బంగా నియోజకవర్గంలోని ప్రైవేట్ వైద్యులు పేదలకు వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో పేదలకు వైద్యసేవలు అందించాల్సిన ప్రైవేట్ వైద్యుల్లో చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులలోనూ సేవలు అందిస్తున్న పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, ఎ ఎన్ ఎంలను స్ఫూర్తిగా తీసుకోని వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఎస్మా చట్టాన్ని ప్రయోగించిందని, వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంగిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.