రెండే రెండు నెలలు… అరవయ్యే రోజులు… సంపద కరిగిపోయింది. పది, వంద, వేయి, లక్ష కోట్లు కాదు.., ఏకంగా రూ. 30 లక్షల కోట్లు కరిగిపోయింది. కరోనా ఎత్తుకుపోయింది. అదే అమెరికన్ డాలర్లలో చెప్పుకుంటే 408 బిలియన్ల అమెరికన్ డాలర్లు కరిగిపోయినట్టు. “హురున్ గ్లోబెల్ రిచ్ లిస్ట్” అనే సంస్థ ఈ ఏడాది జనవరి 31 న విడుదల చేసిన జాబితా, అదే సంస్థ నిన్న విడుదల చేసిన జాబితా చూస్తే కరోనా దెబ్బ ప్రపంచ ఆర్ధిక రంగంపై ఎంతగా ఉందొ అర్ధమవుతుంది. ప్రపంచంలోని టాప్ 100 బిలినియర్లు ఈ డబ్బుని నష్టపోయినట్టు ఆ సంస్థ వెల్లడించింది.
ముకేశ్ పోగొట్టుకున్నది 19 బిలియన్ డాలర్లు…!
ఆ సంస్థ లెక్కల ప్రకారం మన దేశ కుబేరుడు ముకేశ్ అంబానీ ఈ రెండు నెలల వ్యవధిలో 19 బిలియన్ డాలర్లు… అంటే సుమారుగా రూ. లక్షన్నర కోట్లు నష్టపోయారు. అది ఆయన ఆస్తిలో 28 శాతం. జనవరి 31 నాటికీ ఆయన ఆస్తి 67 డాలర్లు ఉండగా, ప్రస్తుతం ఆయన ఆస్తి 48 బిలియన్ డాలర్లు ఉంది. అంటే ఆయన రోజుకి 300 మిలియన్ డాలర్లు (సుమారుగా 21 వేల కోట్లు) పోగొట్టుకున్నారు.
- ఆయనతో పాటూ గౌతమ్ అదానీ సంపద 37 శాతం, హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ అధినేత శివ నాడార్ సంపద 26 శాతం, ఉదయ్ కోటక్ సంపద 28 శాతం తగ్గింది. అంటే ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రపంచ టాప్ 100 ధనవంతుల జాబితాలో ఈ ముగ్గురు చోటు కోల్పోయారు. ఇండియా నుండి కేవలం ముకేశ్ మాత్రమే ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పతనమే…!
ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బ పడుతుందని ముందు నుండి చెప్పుకుంటూనే ఉన్నాం. ఎల్ వి ఎమ్ హెచ్ సంస్థ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ అత్యధికంగా 30 బిలియన్ డాలర్లు కోల్పోయారు. వారెన్ బఫెట్ 19 , బిల్ గేట్స్ 15 , మార్క్ జుకెర్ బర్గ్ 13 బిలియన్ డాలర్ల చొప్పున నష్టపోయారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాత్రం 9 బిలియన్ డాలర్లు మాత్రమే కోల్పోయారు. మొత్తానికి నాటికి, ఇప్పటికీ ఆయనే టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. జనవరి 31 నాటికీ ఆయన ఆస్తి 140 బిలియన్ డాలర్లు ఉండగా, తాజాగా 131 బిలియన్ డాలర్లు ఉంది. ఇలా ప్రపంచం మొత్తం మీద ధనవంతులు వందమంది కలిపి రూ. 30 లక్షల కోట్లు కోల్పోయారని హురున్ వెల్లడించింది.
మార్కెట్లు ముంచుతున్నాయి…!
కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. గడిచిన రెండు నెలల వ్యవధిలో అమెరికన్ మార్కెట్ డౌ జోన్స్ 21 శాతం క్షీణించగా, ఇండియా, బ్రిటన్ మార్కెట్లు 25 శాతం వరకు క్షీణించాయి. ఈ ప్రభావం కీలక కంపెనీలు, వాటి అధినేతలపై పడుతుంది. కానీ చైనా లోని ష్టం మార్కెట్ మాత్రమే స్వల్పంగా ౦.2 శాతం పెరిగింది. ప్రపంచ ధనవంతుల సంగతి పక్కన పెడితే ఇండియాలో సాధారణ స్థాయి ధనవంతులు, వ్యాపారస్తులు అంటే డి మార్ట్ అధినేత, ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత, ఇన్ఫోసిస్, టాటా గ్రూపు కూడా రూ. కోట్లలోనే కోల్పోతున్నాయి.