నిజామాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంలో భారీ సంఖ్యలో రైతులు పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం.
కవితతో కలిపి మొత్తం 185 మంది అభ్యర్థులు ఈ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 178 మంది పసుపు, ఎర్రజొన్న రైతులు.
నిజామాబాద్ జిల్లా రైతులు గత కొన్నేళ్లుగా పసుపు, ఎర్రజొన్నల పంటలకు మద్దతు ధర కోసం నిరసన తెలుపుతున్నారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కవిత ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదని ఆరోపిస్తూ రైతులు ఆమెపై పోటీ చేసేందుకు బరిలోకి దిగారు. తమ సమస్యను దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు పెద్ద మొత్తంలో నామినేషన్లు వేశారు.
సుమారు 200 మంది పైగా రైతుకు నామినేషన్లు దాఖలు చేయగా వారిలో 182 మంది నామినేషన్లు పరిశీలనలో ఆమోదం పొందాయి. ఈరోజుతో ఉపసంహరణ గడువు కూడా ముగియగా నలుగురు రైతులు మాత్రమే నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
ఒక లోక్సభ స్థానానికి 90 కంటే ఎక్కువ మంది పోటీచేస్తే బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. దీంతో నిజామాబాద్ స్థానానికి బ్యాలెట్ ఎన్నిక అనివార్యమైంది.