అమరావతి, మార్చి 28: ఐపిఎస్ అధికారుల బదిలీపై హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ డిజితో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పిలను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్పై గురువారం విచారణ ప్రారంభం కాగా ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించాయి. అనంతరం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఈసి తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదని ఈసీ తరఫు న్యాయవాది వాదించారు.
ఫిర్యాదులు వచ్చినందునే ఆ ఇద్దరు ఎస్పిలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని ఈ విషయంలో పిటిషన్ వేసే అర్హత ప్రభుత్వానికి లేదని కోర్టుకు ఈసి న్యాయవాది తెలిపారు. అసలు ఈ పిటిషనే విచారణకు అనర్హం అని పేర్కొన్నారు. ఇదే కేసులో వైసిపి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడంతో వారి తరఫు వాదనలను కూడా న్యాయమూర్తి అనుమతించారు. ఆ పార్టీ తరఫున సీనియర్ అడ్వొకేట్ సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. అన్ని వర్గాల వాదనలను సావధానంగా విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.