అమరావతి, మార్చి 28: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. సినిమాను ఏప్రిల్ మూడు వరకూ విడుదల చేయరాదని ఆదేశించింది. ఏప్రిల్ మూడున న్యాయమూర్తుల ఛాంబర్లో సినిమాను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు సినిమా చూశాక విడుదల చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
మరోపక్క ఇదే సినిమాపై మంగళగిరి కోర్టు కూడా స్టే విధించింది. ఏప్రిల్ 15వ తేదీ వరకూ సినిమాను విడుదల చేయొద్దంటూ ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది. సోషల్ మీడియాకు కూడా ఇంజంక్షన్ ఆర్డర్ వర్తిస్తుందని పేర్కొంది.
దర్శకుడు రాంగోపాల్వర్మ, రాకేష్ రెడ్డి, ఆగస్త్య మంజులకు కోర్టు దీనిపై నోటీసులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో విడుదలకు బ్రేక్ పడినప్పటికీ తెలంగాణలో మాత్రం అనుకున్నట్లుగానే మార్చి 29 న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
తెలంగాణలో సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ కూడా సినిమా విడుదలపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.