ఈ నెల 15వ తేదీన తమిళనాడు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద కారులో తరలిస్తున్న 5.27 కోట్ల రూపాయలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తును చేపట్టింది.
ఈనెల 15న తమిళనాడు అరంబక్కంలోని ఎలవూరు చెక్పోస్టు వద్ద కారు నుంచి పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్న విషయంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేయాలని రామ్మోన్ నాయుడు ఫిర్యాదులో కోరారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. నగదు తరలిస్తున్న కారుపై ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో రాజకీయ దుమారం రేపింది. అధికార పార్టీకి చెందిన నాయకుల అక్రమార్జనే పట్టుబడిందంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. అయితే నగదు తనదేనని బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు చెప్పారు. ఆ నగదుకు సంబందించిన పత్రాలు ఉన్నాయన్నారు.
దీనిపై రాష్ట్రంలోని కొంత మంది అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు ఉన్నాయి. బాలు అనే అతను ఒంగోలుకు చెందిన ఒక వైసీపీ నాయకుడు. జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు. అయితే అయనపై ఆరోపణలు రావడంతో అధికార పార్టీ నేతలు కొంత ఇరుకున పడ్డారు. అయితే ఈ విషయాన్ని మంత్రి బాలినేని స్వయంగా ఖండించారు. ఎటువంటి విచారణ కైనా సిద్ధంగా ఉన్నామని, ఎక్కడికైనా వెళతామని ప్రకటించారు. తాజాగా ఈడీ కూడా దర్యాప్తు చేపట్టడంతో అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.