దేశ రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాలు వేరయా.. అంటే అతిశయోక్తి కాదేమో. అక్కడ సినిమాలకు రాజకీయాలకు మధ్య పెద్ద వారధే ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత.. అక్కడ రాజకీయ ఉద్దండులు. తమిళ సినిమాను శాసించారు.. రాజకీయాలను కూడా అదేస్థాయిలో శాసించడం వారికే చెల్లింది. వారి మరణానంతరం పార్టీల పగ్గాలు నాయకులు నడిస్తున్నారు. కానీ.. ప్రస్తుత తమిళనాడు రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. డీఎంకేకు స్టాలిన్ వారసత్వం ఉంది. కానీ.. అన్నాడీఎంకేకు జయలలిత తర్వాత వారసులు ఎవరనేది ఇదిమిద్దంగా తేలకపోయినా.. నేనున్నాను అంటూ వస్తున్నారు శశికళ.
శశికళ కల నెరవేరేనా..
జయలలిత నిచ్చెలిగా పేరున్న శశికళ అనూహ్య పరిణామాల మధ్య జయలలిత మరణం తర్వాత జైలుకెళ్లారు. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆమె త్వరలో విడుదల కానున్నారు. శిక్షా కాలం ఇంకా ఉన్నా.. 10కోట్లు జరిమానా కట్టి 2021 జనవరి 27న విడుదల కాబోతున్నారు. అదే ఏడాది వేసవిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమె విడుదల ఆసక్తి రేపుతోంది. ఆమె జైలుకు వెళ్తూ పళనిస్వామిని సీఎంను చేశారు. ఇప్పుడు వచ్చీరావడంతోనే పార్టీ పగ్గాలు చేపట్టి ఎన్నికలకు సిద్ధం కానున్నారు. తమిళనాడు సీఎం కావాలనేది ఆమె కల. ఇందుకు 10కోట్లు చెల్లించి మరీ వచ్చేస్తున్నారు. అయితే.. ప్రస్తుత తమిళ రాజకీయాలు పద్మవ్యూహంలా మారిపోబోతున్నాయి. ఇందుకు కారణం కొత్త పార్టీలు పుట్టుకురావడమే.
బీజేపీ ప్రభావం పని చేస్తుందా..
తమిళ సినిమా మరోసారి అక్కడి రాజకీయాల్లో ప్రభావం చూపనుంది. కమల్ హాసన్ పార్టీ పెట్టి ఇప్పటికే నడిపిస్తున్నారు. రజినీకాంత్ పార్టీ ప్రకటించినా ఇంకా మీమాంశలో ఉండిపోయారు. మరోవైపు స్టాలిన్ కు అన్న అళగిరి కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. వీటన్నింటికి తోడు తమిళ రాజకీయాలపై బీజేపీ కన్నేసింది. చిన్న పార్టీలను కలుపుకునే పనిలో ఉంది. ఇందులో అన్నాడీఎంకే చేరుతుందా, డీఎంకే చేరుతుందా, రజినీ, కమల్, అళగిరి చేరతారా.. ఏంటనేది క్లారిటీ లేదు. వీరిమధ్యలో శశికళ వచ్చిన అన్నాడీఎంకేకు ప్రజాదరణ దక్కుతుందంటే కొంచెం కష్టమైన పనే. జయలలిత సమాధిపై శపథం చేసి మరీ జైలుకెళ్లిన శశికళకు మరి పై నుంచి అమ్మ ఆశీస్సులు ఉంటాయో లేదో తేలాల్సి ఉంది. పుట్టగొడుగుల్లా ఉన్న తమిళ పార్టీలను చూసి తంబీలు ఎవరికి పట్టం కడతారో మరి.