అమరావతి: అనంతపురం లోక్ సభ పరిధిలోని సిట్టింగ్ ఎంఎల్ఏ లను మార్చాలని ఎంపి జేసి దివాకర్ రెడ్డి పట్టు పట్టారు. కనీసం ముగ్గురు సిట్టింగులను మారిస్తే తప్ప ఎంపి సీటు గెలవలమని జేసి పేర్కొన్నారు. జేసీ శుక్రవారం అమరావతిలో టిడిపి స్క్రీనింగ్ కమిటీతో భేటీ అయ్యారు.
భేటీ అనంతరం ఆగ్రహంగా బయటకొచ్చిన జేసి స్క్రీనింగ్ కమిటీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా తో మాట్లాడుతూ.. కమిటీ ఆలోచనలు స్పష్టంగా లేవని విమర్శించారు. కొంతమంది నాయకులపై అనుమానాలు ఉన్నాయనీ, కమిటీలో కొంతమంది మాటలు తనకు నచ్చలేదని అన్నారు.
సింగనమల, కళ్యాణదుర్గం, గుంతకల్లులో సిట్టింగులను మార్చాలని స్క్రీనింగ్ కమిటీకి సూచించినట్లు జేసి తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ తాను చెప్పిన విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిందో లేదో తెలియదన్నారు.
సిట్టింగులను మార్చినా గట్టిగా పోరాడాల్సి ఉంటుందని జేసి చెప్పారు. సిట్టింగ్లను మార్చకుంటే అనంతపురం లోక్సభ స్థానంలో ఓటమి తప్పదనీ, తాను ఓడిపోయేందుకు సిద్దంగా లేనని జేసి వ్యాఖ్యానించారు.
లిస్ట్ వచ్చాక ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుస్తుంది దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ మారను కానీ పోటీ చేయాలో లేదో ఆలోచిస్తా అని జేసి అన్నారు.