కొద్దికాలం గ్యాప్ ఇచ్చిన వైసిపి మంత్రి కొడాలి నాని మళ్లీ రెచ్చిపోయారు.తెలుగుదేశం పార్టీపైనా ,లోకేష్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అంటే ఒంటికాలిపై లేచే కొడాలి నాని గతంలో కూడా చాలా వివాదాస్పద ప్రకటనలు చేయటం తెలిసిందే.ఆయనకు టీడీపీ ముద్దుగా బూతుల మంత్రి అనే పేరు పెట్టడం కూడా విదితమే.తెలుగుదేశం పార్టీ పై విమర్శల వరకూ కొడాలి నాని బాగానే నెట్టుకొచ్చినప్పటికీ అంతర్వేది ఆలయ రథం దగ్ధమైన సంఘటన నేపధ్యంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ప్రధాని నరేంద్రమోడీకి కూడా తగిలే రీతిలో కొడాలి నాని అప్పట్లో వ్యాఖ్యలు చేశారు.తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో తప్పనిసరిగా ఆయన పక్కన సతీమణి ఉండాలన్న టిడిపి వాదనను కొడాలి నాని ఖండిస్తూ మీడియా సమావేశం పెట్టి ఇదేమీ సంప్రదాయం కాదంటూ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు.ఆ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ గురించి కూడా ప్రస్తావించారు.ఆ విషయం పెద్దదయ్యేసరికి అప్పటినుండి మంత్రిగారు కొద్దిగా సంయమనం పాటిస్తున్నారు దాదాపు మౌనంగానే ఉంటున్నారు.ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కొడాలి నానికి తెలుగుదేశంపై కోపం వచ్చింది.తన సహజ ధోరణిలో ఆ పార్టీని ఏకిపారేశారు.ముఖ్యంగా చంద్రబాబు తనయుడు లోకేష్ బాబును వేస్ట్ ఫెలో అంటూ దుమ్మెత్తి పోశారు. లోకేష్ కి లోకజ్ఞానమే లేదన్నారు. వరద బాధితుల పరామర్శ పేరుతో లోకేశ్ రాష్ట్రమంతా తిరిగినా ఒరిగేదేమీ ఉండదని నాని అన్నారు.
టీడీపీ వారే లోకేషును పట్టించుకోవడం లేదని ఇక ప్రజలైతే ఆయననొక కమెడియను లాగ చూస్తున్నారన్నారు.అదే సమయంలో తెలుగుదేశం పార్టీ డ్రామాలను కూడా ప్రజలు గమనిస్తున్నారని వారిని నమ్మే పరిస్థితి లేదని ఆయన చెప్పారు.అమరావతిలో రైతులకు బేడీలు వేసిన ఘటన ను తెలుగుదేశం పార్టీ అతిగా చూపుతూ నాటకాలాడుతోందన్నారు.అక్కడ రైతులకు బేడీలు వేశారని బాధపడిపోతూ తెలుగుదేశం నాయకులు తమ చేతులకు బేడీలు వేసు కోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.మరి బషీర్ బాగ్ లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్తు ఛార్జీలు పెంచడానికి నిరసనగా జరిగిన ప్రదర్శన సందర్భంలో పోలీసు కాల్పుల్లో రైతులు మరణించారని, ఆ సందర్బంలో సైతం ప్రజలపై అంత ప్రేమ ఉన్న టిడిపి నేతలు తమను తామే కాల్చుకుని ఉండవచ్చు కదా అని కూడా కొడాలి నాని ఎద్దేవా చేశారు.టిడిపి ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టకపోతే తామే అసలు గుట్టు రట్టు చేస్తామని కొడాలి నాని హెచ్చరించారు.