ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే పార్టీలో పూర్తి ఆదిపత్యం అనే సంగతి తెలిసిందే. పార్టీ ముఖ్య నేతలైనా, మంత్రులైనా ఆయన మాటను వినాల్సిందే.
కానీ ఓ ఎమ్మెల్యే, మరో ముఖ్య నేత మాత్రం దీనికి మినమాయింపు అని అంటున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే పార్టీల జగన్ మాటను పట్టించుకోని నేతలు వీరేనంటూ ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇదంతా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం గురించి.
గన్నవరంలో గరంగరం
ఏపీలోని ఆసక్తికర రాజకీయాలకు మారుపేరుగా నిలిచే అసెంబ్లీ నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. ఇలాంటి నియోజకవర్గం నుంచి టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేల్లో ఒకరిగా పేరొందిన వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి ఊహించని షాకిచ్చి అధికార వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ గూటికి చేరడంతో రాజకీయం మారింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నేతలుగా గుర్తింపు పొందిన యార్లగడ్డ, దుట్టా రామచంద్రరావులు పార్టీ కోసం శ్రమించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ గూటికి చేరడంతో ఆయనతో కలిసి పని చేసేందుకు సీనియర్ వైసీపీ నేతలు నో చెప్పారు. దీంతో సహజంగానే వల్లభనేని వంశీకి వైసీపీ క్యాడర్ సపోర్ట్ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్నప్పటి నుండి తనతో పాటు ఉన్న వారితోనే వంశీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అయితే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన పట్టు పెంచుకునేందుకు సత్తా కొనసాగించేందుకు వంశీ స్వయంగా ఎంట్రీ ఇచ్చి తానే వైసీపీ ఇంచార్జీనని ప్రకటించుకున్నారు. దీంతో కలకలం రేగింది.
వంశీ ప్రకటనతో మండిపోయి…
టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు పలుకుతున్న వంశీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్చార్జినని చెప్పడమే కాకుండా ఎమ్మెల్యేను అని కూడా స్వయంగా ప్రకటించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ వైసీపీ కండువా కప్పుకోలేదు. అలాంటప్పుడు టీడీపీ ఎమ్మెల్యేని వైసీపీ పార్టీ ఇంచార్జి అని చెప్పుకోవడం ఏంటని వైసీపీ సీనియర్ నేతలు ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఏకంగా రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటన సంచలనం రేపింది. అనంతరం ఓ సమావేశంలో సీఎం జగన్ ఎమ్మెల్యే వంశీ, పార్టీ నేత యార్లగడ్డ మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేసినా అది పలితం ఇవ్వలేదు.
వంశీకి మామూలు షాక్ ఇవ్వట్లేదుగా
గన్నవరం వైసీపీలో లుకలుకలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా వైసీపీ సీనియర్ నేతలు యార్లగడ్డ, దుట్టా, దాసరి వర్గాలు ఏకమయ్యాయి. వంశీని పార్టీలో ఒంటరి చేసి తిరిగి ఇంచార్జి అవ్వాలి అని యార్లగడ్డ ఎత్తులు వేస్తున్నారు. అధినేత జగన్ చెప్పిన కలిసి పనిచేయడానికి ససేమిరా అంటున్న యార్లగడ్డ, దుట్టా వర్గాలు నియోజకవర్గంలో రెచ్చగొట్టే విధంగా కార్య కలాపాలు చేపడుతున్నాయని అంటున్నారు. వంశీకి కోవిడ్ సోకిన సమయంలో వర్గ రాజకీయం మొదలై వంశీని వైసీపీ కి దగ్గర అవ్వకుండా ముగ్గురు నాయకులు కూటమి కట్టినట్లు సమాచారం. కాగా, వల్లభనేని వంశీ వైసీపీ నేతలను కలుపుకొని ముందుకు సాగడంలో విఫలం అవడం వల్లే ఇలా వైసీపీ సీనియర్లు గ్రూపులు కట్టారా లేదంటే పార్టీలోని పరిణామాలు కారణమా? అనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో పార్టీ అధినేత మాటను ఈ నేతలు లెక్క చేయడం లేదా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.