‘హైదరాబాద్ విశ్వనగరం.. మేం హైదరాబాదీలం.. మాది హైదరాబాద్’.. అక్కడ నివసించే ప్రతి పౌరుడు ఘనంగా చెప్పే మాట ఇది. ఆ విశ్వనగరం అభివృద్ధికి తమ వంతుగా పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. ‘ఓటు వేయడం’ తప్ప. కానీ అదే కొరవడింది. నిన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లేసేవారు కరువయ్యారు. మీడియా, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వచ్చిన ఓటింగ్ శాతం లెక్కలు రాజకీయ పార్టీలతోపాటు ప్రజలను కూడా విస్మయానికి గురి చేసాయి. ఉదయం 9వరకూ 4, ఒంటిగంటకు 18, 3గంటలకు 25, 5గంటలకు 35 మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది. అయితే.. చివరి గంటలో ఏం జరిగిందో.. ఏమో..! ఎన్నికలు ముగిసిన తర్వాత విడుదల చేసిన లెక్కల్లో మొత్తంగా 45.71 ఓటింగ్ జరిగినట్టు ఎన్నికల కమిషన్ తేల్చింది.
ఓటేయడానికి ఆ సమయం చాలు.. కానీ
ఉదయం నుంచీ పోలింగ్ బూత్ లకు రాని జనం సాయంత్రం మాత్రమే పోలింగ్ బూత్ లకు వెళ్లారా? వేసవి అయితే ఎండలకు భయపడి రాకపోవడం.. సాయంత్రం ఓటింగ్ పెరగడం సహజమే. కానీ.. ఇది శీతాకాలం. ఎండలో ఎక్కువగా ఉండాలని భావిస్తారు. కానీ.. ఇప్పుడూ సాయంత్రమే ఓటేయడానికి వచ్చారు. చివరి గంటలో ఏం జరిగింది? ఈసీ సాయంత్రమే ఓటేయమని చెప్పదు. రాజకీయ పార్టీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. గ్రేటర్ ఓటర్లు, సెటిలర్లు,.. ఇలా అందరూ సాయంత్రమే ఎందుకు బయటకు వచ్చారు. సినిమాలు లేవు. షాపింగ్ ఎప్పుడూ ఉండేదే. సెలవు కాబట్టి రెస్టారెంట్లకు వెళ్లాలనిపిస్తే ఉదయం ఓటేసి వెళ్లొచ్చు.. ఎంత బద్దకంగా నిద్రలేచినా మధ్యాహ్నం 3లోపు ఓటేయొచ్చు. కానీ.. సాయంత్రం ఆఖరి గంటలో మాత్రమే ఓటింగ్ పెరిగింది.
సామాన్యుడి అనుమానం ఇదీ..!
ఆఖరి గంటలో టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై ఓటింగ్ పై ప్రభావం చూపాయా? అనే వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నచోట బీజేపీ కాంప్రమైజ్ అయిందా.. బీజేపీ గెలిచే అవకాశం ఉన్న కొన్ని చోట్ల టీఆర్ఎస్ కాంప్రమైజ్ అయిందా? రిగ్గింగ్ కు అవకాశం కల్పించుకున్నారా..? అందుకే 10 శాతం ఓటింగ్ పెరిగిందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఎలక్షన్లలో రిగ్గింగ్ అనేది గతం. టెక్నాలజీ వినియోగం బాగా పెరిగిన తర్వాత ఇందుకు అవకాశం లేకపోయింది. ఎలక్షన్ కమీషన్ కఠిన నిబంధనలు, మీడియా విస్తృతి పెరగడం, సోషల్ మీడియా, పోలీసుల నిఘా, సీసీ కెమెరాలు, కఠిన చట్టాలు, మినిట్ టు మినిట్ క్యాలిక్యులేషన్స్ వెరసి ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడే అవకాశాలు తక్కువే అయ్యాయి. ఇన్ని సానుకూలతలు ఉన్న ఈ రోజుల్లో పోలింగ్ లో అక్రమాలకు అవకాశమే లేదని ఎన్నికల కమిషన్ చెప్తోంది. ప్రచారంలో కొదమసింహాల్లా తలపడిన టీఆర్ఎస్-బీజేపీ ఒకరికొకరు కాంప్రమైజ్ అయ్యారంటే కూడా నమ్మదగినది కాదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే.. సామాన్యుడికి వచ్చే ఆలోచనలకు అడ్డుకట్ట ఉండదనే చెప్పాలి.. అతనే ఓటరు కాబట్టి..!