Skill Development scam Case: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్ ను హైకోర్టు అక్టోబర్ 12వరకూ పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. లోకేష్ ముందస్తు బెయిల్ పై ఇవేళ హైకోర్టులో విచారణకు వచ్చింది. లోకేష్ ముందస్తు బెయిల్ ఈ రోజుతో ముగుస్తుందని ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. తనకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు లేవని సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం న్యాయస్థానానికి తెలిపారు.
ఈ కేసు విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేయాలని ఆయన కోర్టును కోరారు. దీంతో అప్పటి వరకూ లోకేష్ కు ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ కు సీఆర్పీసీ 41 ఏ నోటీసుల ఇచ్చి విచారణ చేస్తామని ఇంతకు ముందే హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే 41ఏ నోటీసుల్లోని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేష్ హైకోర్టు ఆశ్రయించగా, హెరిటేజ్ కు సంబంధించిన పత్రాలపై ఒత్తిడి చేయమని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ నెల 4వ తేదీన విచారణకు లోకేష్ సీఐడీ ముందు హజరు కావాల్సి ఉండగా, హైకోర్టు సీఐడీ విచారణను పదవ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 10వ తేదీ సీఐడీ విచారణకు లోకేష్ హజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. ఉదయం పది గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారణ జరపాలని, న్యాయవాదిని అనుమతించాలని ఆదేశించింది. ఇక ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటి వరకూ లోకేష్ పేరు నిందితుడిగా సీఐడీ చేర్చలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీంతో మూడు కేసుల్లోనూ లోకేష్ కు అరెస్టు భయం వీడినట్లు అయ్యింది.