వరంగల్: ప్రధాని కావాలనే కోరిక తనకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ స్పష్టం చేశారు. ప్రధాని ఎవరైనా ప్రజల అభీష్టం నెరవేరాలనేదే తన ఆకాంక్ష అని కేసిఆర్ చెప్పారు. మంగళవారం వరంగల్లోని అజాంజాహీ మిల్లు మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసిఆర్ మాట్లాడారు.
కేంద్రంలోనూ ప్రాంతీయ పార్టీల పెత్తనం ఉంటేనే రాష్ట్రాల సమస్యలు తీరుతాయని కేసిఆర్ అన్నారు. కాంగ్రెసేతర, భాజపాయేతర కూటమే కేంద్రంలో అధికారంలోకి రానుందని జాతీయ ఛానెళ్లు చెబుతున్నాయనీ, 16 ఎంపి స్థానాల్లో టిఆర్ఎస్ను గెలిపిస్తే దేశ దశ దిశను మార్చే రాజకీయాలు చేస్తామని కేసిఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోది రోజూ తిట్టుకోటమే సరిపోతుందని కేసిఆర్ ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు దేశాన్ని పాలించింది ఆ రెండు పార్టీలేననీ, 70 ఏళ్లు గడిచినా దేశంలోని సమస్యలను ఎందుకు పరిష్కరించలేదనీ కేసిఆర్ ప్రశ్నించారు.
పన్నుల రూపంలో తెలంగాణ నుంచి ఢిల్లీకి లక్ష కోట్ల రూపాయలు వెళ్తున్నాయి. కానీ రాష్ట్రానికి మాత్రం కేవలం 25వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని కేసిఆర్ అన్నారు.