municipal Elections : ఏపీలో 12 మున్సిపల్ municipal Elections కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటిలు, నగర పంచాయతీలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్హహించారని ఎన్నికల కమీషన్ నుంచి ప్రశంసలు అందుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఎన్నికల విషయంలో ఎటువంటి పంచాయితీలకూ వెళ్లకుండా ఎన్నికల కమీషన్ కంటే ముందే ఎన్నికలకు సిద్ధం అంటూ ప్రకటించింది. దీంతో ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడమూ.. పార్టీలు తమ ప్రచారాలు మొదలుపెట్టడమూ జరిగిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేవు కాబట్టి ఈ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ. పంచాయతీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న జనసేన కూడా కార్పొరేషన్ ఎన్నికల సమరోత్సాహంతో ముందుకెళ్తోంది. ఇక బీజేపీ మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండటం లేదనే చెప్పాలి.
వైసీపీ గురి అటువైపే..
వైసీపీ ముఖ్యంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లపై కన్నేసింది. ఎలాగైనా వీటిలో తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో ప్రధానంగా విశాఖ, విజయవాడ కార్పొరేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖలో వైసీపీ జెండా ఎగురేస్తామని ఆ ప్రాంత నేతలు ఇప్పటికే ప్రకటనలు చేశారు. విజయసాయి రెడ్డి కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి క్యాడర్ ను బలోపేతం చేస్తున్నారు. విశాఖను రాజధాని చేయాలని ప్రయత్నాలు చేస్తున్న వైసీపీకి ఈ ఎన్నికలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. విజయవాడలో కూడా వైసీపీ తన పాగా వేయాలని భావిస్తోంది. ఇక్కడా వైసీపీకి గట్టి పట్టే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమం నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు వైసీపీ నుంచి గెలిచి పట్టు సాధించారు. తూర్పులో టీడీపీ అభ్యర్ధి గద్దె రామ్మోహన్ గెలిచారు. దీంతో ఇక్కడ కార్పొరేషన్ లో తమ పట్టు సాధించాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది.
భారీ అశలతో టీడీపీ..
టీడీపీ కూడా విజయవాడ, విశాఖపై గురి పెట్టింది. వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఉందని చెప్తూ ఎన్నికలకు వెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన టీడీపీకి కార్పొరేషన్ ఎన్నికలు కీలకంగా మారాయి. వైసీపీని ఓడించి ప్రభుత్వ వ్యతిరేకతను చూపేకంటే.. ప్రజల్లో తమకు ఆదరణ ఉందని చూపుకోవడం ఇప్పుడు ఆ పార్టీకి కీలకంగా మారింది. విశాఖలో కీలక నేతలు పార్టీ మారినా.. తమ వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రస్తుతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని ఆయుధంగా చేసుకుంటోంది. ఇటివలే చంద్రబాబు కూడా పర్యటించి ప్రభుత్వ వైఫల్యం అని ఓ ప్రకటన చేశారు. విజయవాడలో రాజధాని అమరావతి అంశాన్ని, ప్రెజెంట్ ఇష్యూ.. దుర్గ గుడిలో అక్రమాలు, మంత్రి వెల్లంపల్లిపై వస్తున్న ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లి లాభం పొందాలని చేస్తోంది. ఇప్పటికే నేతలు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం గెలిచిన టీడీపీ ఆ హవాను నగరంలో నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇకపోతే.. అంచనాలు లేకుండా పంచాయతీ ఎన్నికల్లో సంచలనాలు రేపిన జనసేన కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా జనసేనతో పొత్తు లాభిస్తుందని భావిస్తోంది.
అంచనాలు నిలుపుకోవాలని జనసేన-బీజేపీ
మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం పార్టీలన్నీ ఎవరి లెక్కల్లో వారు ఉండిపోయారు. ఒక అంచనా ప్రకారం.. ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.. మున్సిపాలిటీల్లో పోటాపోటీగా నిలుస్తాయని భావిస్తున్నారు. ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉంటుందని తెలుస్తోంది. చిత్తూరు, తిరుపతి, గుంటూరు, అనంతపురం, కర్నూలు.. ప్రాంతాల్లో తమకు తిరుగుండదని భావిస్తోంది. ఇక టీడీపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. వైసీపీని ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. తర్వాత జరిగే జడ్పీటీస, ఎంపీటీసీ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలో కూడా తన సత్తా చాటాలని భావిస్తోంది. వైసీపీ ఎలానూ సేఫ్ జోన్లో ఉంది కాబట్టి.. పట్టు నిలుపుకోవాలి. టీడీపీ అలా కాదు.. ప్రజల్లో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందాలి. ఇది చాలా పెద్ద టాస్క్. జనసేన-బీజేపీ కూటమి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై పెద్ద ఆశలే పెట్టుకుంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, చిత్తూరు.. జిల్లాల్లో కొన్ని స్థానాలు గెలవగలమని భావిస్తోంది. రెండో స్థానంలో నిలిచినా జనసేన సాధించిన విజయంగానే చెప్పుకోవచ్చు. మరి.. వచ్చే ఎన్నికల కాలంలో ఈ పార్టీలు ఎలా సత్తా చాటుతాయో చూడాలి.