ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చుట్టూ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ అకృత్యాలకు పాల్పడుతోంది ఎవరనేదానిపై పోలీసులు కూడా తేల్చలేకపోతున్నారు. దీంతో పోలీసుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా జగన్ ప్రభుత్వంపై హిందూ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. దీంతో ప్రభుత్వానికి జరుగుతున్న డ్యామేజీని సరిదిద్దేందుకు సీఎం జగన్ రంగంలోకి దిగారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కూల్చేసిన గుళ్లు మళ్లీ నిర్మిస్తామంటూ సీఎం ఆ పనిని ఆఘమేఘాల మీద శంకుస్థాపన కూడా చేశారు. ఇదేకాకుండా మున్ముందు ఇటువంటి పరిస్థితులు తలెత్తితే ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించారు.
జగన్ కు పీకేపై నమ్మకం అలాంటిది..
2019 ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతోనే జగన్ ముందుకెళ్లారు. వైసీపీ నవరత్నాలు కూడా ప్రశాంత్ కిశోర్ అండ్ టీమ్ సూచన మేరకు రూపొందించినవే అంటారు. మొత్తానికి 2014లో మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో కూర్చోవడానికి ఎలా కారణమయ్యారో.. 2019లో జగన్ ఏపీలో అధికారంలోకి రావడానికి కూడా అంతే కారణమయ్యారు. పొలిటికల్ అనాలసిస్ లో హై టాలెంటెడ్ ప్రొఫెషనలిస్ట్ గా పేరు పొందిన ప్రశాంత్ కిశోర్ ను జగన్ మళ్లీ పిలిపించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న విగ్రహాల ధ్వంసంపై పీకే సూచనల కోసం జగన్ ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి భేటీ జరిగిందని కూడా తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను పీకేకు పూర్తిగా వివరించినట్టు తెలుస్తోంది.
ఎలాంటి వ్యూహం అమలు చేస్తారో..!
ఎన్నికల్లో జగన్ కు రాష్ట్ర ప్రజలు తిరుగులేని మెజారిటీతో అధికారం అప్పజెప్పారు. ప్రజల మద్దతు ఉన్న జగన్ ను మతపరమైన అంశంలో ఇరికించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయనేది నిజం. హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరుగుతోంది. అంతర్వేది రధం దగ్దమైనప్పుడు కూడా రాని చంద్రబాబు రామతీర్ధం వచ్చారు. జనసేన, బీజేపీ కూడా రామతీర్ధం వెళ్లాయి. దీంతో జగన్ కు ముప్పేట దాడి ఎక్కువైంది. జగన్ ను హిందూ వ్యతిరేక ముద్ర పడేలా అడుగులు పడుతున్నాయి. పార్టీలన్నీ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించిన ప్రజల మనోభావాలు, మతంతో ఎవరూ పెట్టుకోలేరు. దీంతో వీటన్నింటికీ చెక్ పెట్టాలనేది సీఎం జగన్ ఆలోచన. ఇందుకే ప్రశాంత్ కిషోర్ ను మళ్లీ సంప్రదించారు.
భేటీ అంతర్యం ఏమిటో..?
అత్యంత గోప్యంగా ఉంచిన ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం వేయాల్సిన అడుగులు, ప్రజలకు నమ్మకం కలిగించడం, పరిస్థితులను ఎలా అదుపు తెచ్చుకోవాలనే అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. వీటితోపాటు రాష్ట్రంలో ఎస్ఈసీకి ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధం, స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక, రాజధాని అంశం.. ఇలా అన్నీ చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ తోపాటు పార్టీలోని సీనియర్ నేతలు పాల్గొన్న ఈ భేటీలో చర్చించిన అంశాలేవీ లీక్ కాకుండా జగ్రత్త పడ్డారు. దీంతో సీఎం ప్రశాంత్ కిషోర్ నుంచి సలహాలేం తీసుకున్నారో కూడా తెలియరాలేదు. నిజానికి ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో ఉన్నారు. సీఎం మమతా బెనర్జీకి రాజకీయ సలహాలు ఇస్తూ తృణమూల్ విజయానికి కృషి చేస్తున్నారు. ఏపీలో జరిగిన మ్యాజిక్ రిపీట్ చేయలనేది వారి ఆలోచన.
జగన్ ఎలా బయటపడతారో..?
జగన్ ను ఇరకాటంలోకి నెట్టేస్తున్న హిందూ దేవతా విగ్రహాల అంశం గత ఏడాది కూడా జరిగాయి. అంతర్వేది ఆలయంలోని పురాతన రధం తగలబడిపోవడం, కర్నూలులో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం జరిగింది. ఆ ఘటనల నిందితులను కూడా ఇంతవరకూ పసిగట్టలేక పోయారు. కొన్నాళ్లు సైలంట్ అయిన ఈ తరహా ఘటనలు రామతీర్ధంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసంతో పరాకాష్టకు చేరింది. రోజు గ్యాప్ లోనే విజయవాడలోని ఒక ఆలయంలో సీతమ్మ వారి విగ్రహం ధ్సం మరింత కాక రేపింది. ఈ నేపథ్యంలో పెల్లుబికిన నిరసనలు, ప్రతిపక్షాల దాడులను ఎదుర్కొనేందుకు జగన్ సంకల్పించి ప్రశాంత్ కిశోర్ ను రప్పించారు. మరి ఆయన సీఎం జగన్ ను ఎలా డైరెక్ట్ చేయబోతున్నారనేదే అసలు అంశం.