(కరీంనగర్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సిద్దిపేట సీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిన్న రాత్రి నుండి ఆయన కరీంనగర్లో తన కార్యాలయంలో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు అక్కడకు వచ్చి బండి సంజయ్కు సంఘీభావం తెలియజేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు బలవంతంగా బండి సంజయ్ను ఆసుపత్రికి తరలించారు. పెద్ద సంఖ్యలో బీజెపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. ఆసుపత్రిలో బీజెపీ నాయకులు బండి సంజయ్కి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. మాజీ ఎంపిలు వివేక్, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిన్న దుబ్బాక ఉప ఎన్నికల బీజెపీ అసెంబ్లీ అభ్యర్థి రఘునందన రావు నివాసంతో పాటు సిద్దిపేటలో ఆయన మామ, బంధువుల ఇంట్లో రెవెన్యూ, పోలీసు అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి బండి సంజయ్ హుటాహుటిన సిద్దిపేట బయలుదేరి వెళ్లగా పోలీసులు అడ్డుకుని ఆయనను తిరిగి కరీంనగర్కు పంపారు. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎంపి అనే గౌరవం లేకుండా సీపీ తన పట్ల దురుసుగా ప్రవర్తించారనీ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు.
అయితే బండి సంజయ్ ఆరోపణలను సీపీ ఖండించారు. శాంతి భద్రతల సమస్య ఎదురవుతుందని ఎంపికి ముందుగానే చెప్పి గౌరవ ప్రదంగానే కరీంనగర్కు పంపామని సీపీ పేర్కొంటున్నారు. బండి సంజయ్పై పోలీసులు ప్రవర్తించిన తీరు, దుబ్బాక అసెంబ్లీ బీజేపి అభ్యర్థి రఘునందన రావు నివాసాల్లో సోదాల అంశాన్ని బీజెపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక్కడి పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సిద్దిపేటలో జరిగిన సంఘటనపై పూర్తి నివేదికను అందజేయాలని డీజీపీకి లేఖ రాశారు.