Political Image: పొలిటికల్ మాస్ ఇమేజ్ Political Image ప్రాంతీయ పార్టీల బలమేంటో ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయా? జాతీయ పార్టీలపై ప్రజల్లో.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందా? అనే అనుమానాలు రేకెత్తించాయి. తమిళనాడు, కేరళ, బెంగాల్ విజయాలు ఇవే నిరూపిస్తున్నాయి. అంతేకాకుండా.. ఎన్నికల్లో పొలిటికల్ ఛరిష్మా ఎంత ముఖ్యమో కూడా నిరూపించాయి.పొలిటికల్ గా మాస్ మైలేజ్ తెచ్చుకోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కానీ.. ఈ మూడు రాష్ట్రాల విజయాల్లో ఇదే ప్రధాన భూమిక పోషించింది. తమిళనాడులో స్టాలిన్, కేరళలో పినరయి విజయన్, బెంగాల్లో మమతా బెనర్జీ.. ప్రజల్లో తమకున్న ఇమేజ్ స్థాయి ఏంటో నిరూపించారు. మమత వరుసగా మూడోసారి, విజయన్ రెండోసారి, స్టాలిన్ మొదటిసారి సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు.
సినిమాల్లో హీరోలకు మాస్ ఇమేజ్ రావాలంటే ఆ తరహా సినిమాలు చేయాలి.. ప్రేక్షకుల్ని మెప్పించాలి. పొలిటికల్ మాస్ ఇమేజ్ తెచ్చుకోవడానికి నాయకులు చాలా కష్టపడాలి.. ప్రజల్ని మెప్పించాలంటే క్షేత్రస్థాయిలో పని చేయాలి. ఈ ముగ్గురు నాయకులు అదే చేశారు. పోరాట యోధురాలిగా వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టిన దీదీ.. 2011లో తొలిసారి సీఎం అయ్యారు. 2016, 2021లో మళ్లీ గెలిచారు. గెలిచిన ప్రతిసారీ సీట్ల సంఖ్య పెరగడం.. ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె కాలికి గాయమైనా వీల్ చైర్ నుంచే అంతా తానై నడిపించడం మమత చరిష్మాకు నిదర్శనం. 1980 నుంచి ప్రతి ఐదేళ్లకు అధికారం మారే సంప్రదాయం ఉన్న కేరళలో పినరయి విజయన్ దానికి అడ్డుకట్ట వేయడం కూడా చెప్పుకోదగ్గదే.
అయిదేళ్ల పాలనలో వరదల సమయంలో తీసుకున్న చర్యలు, గతేడాది కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు ప్రజలకు విజయన్ పై నమ్మకాన్ని పెంచాయి. స్టాలిన్ విషయానికి వస్తే.. కరుణానిధి తనయుడిగా తమిళ ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది. 2016 ఎన్నికల్లో డీఎంకే గెలిచినా కరుణానిధి సీఎం అయ్యేవారు. అయితే.. వారసత్వంగా సీఎం అయ్యేకంటే.. సొంత చరిష్మాతో, కష్టంతో సీఎం కావడం ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది. కరుణానిధి మరణం తర్వాత స్టాలిన్ ఈ ఎన్నికల్లో పార్టీని ఒంటిచేత్తో నడిపించారు. పర్యటించారు. ప్రజలను మెప్పించారు. ఫలితంగా ప్రజలు డీఎంకేకు అధికారం కట్టబెట్టడంతో సీఎం కాబోతున్నారు. వీరు ముగ్గురూ తమ చరిష్మాతో ప్రజల్లోకి వెళ్లి తమను తాము నిరూపించుకోవడం విశేషం.