గాంధీనగర్: ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించిన తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి బహిరంగ సభలో మాట్లాడారు. గుజరాత్ లో నిర్వహించిన సభలో ఆమె 8 నిమిషాల పాటు ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పేదలకు కనీసం తిండి కూడా లేదంటూ ప్రభుత్వంపై నిశితంగా విమర్శలు గుప్పించారు.
అంతా బాగానే ఉంది గానీ, ఆమె తన ప్రసంగం ప్రారంభించిన తీరుపైనే కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. సాధారణంగా ఇందిరాగాంధీ దగ్గర నుంచి నాయకులు ఎవరైనా ‘నా ప్రియమైన అన్నలు.. చెల్లెల్లారా’ అని ప్రారంభిస్తారు. కానీ ప్రియాంక మాత్రం ‘మేరే బెహనోం ఔర్ మేరే భాయియోం’ (నా అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు) అని ప్రారంభించారు. ఆమె కావాలనే అలా చేశారో లేదా పొరపాటున అలా వచ్చేసిందో గానీ.. వరుసక్రమం మాత్రం మారిపోయింది.
ఈ విషయాన్ని అసోంలోని సిల్చార్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్ ట్వీట్ చేశారు. ప్రియాంక ప్రసంగం వీడియో క్లిప్ ను ఆమె షేర్ చేశారు. దాంట్లోనే ఇలా వరుసక్రమం మారిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘గుజరాత్ రాష్ట్రంలో ప్రియాంకాగాంధీ ప్రసంగం చాలా కారణాలతో బాగుంది. చాలామందిలా కాకుండా వరుసక్రమం మార్చడాన్ని నేను చాలా ఇష్టపడ్డాను. ఆమె బెహనోం ఔర్ భాయియోం అన్నారు.. వేరేలా కాకుండా’’ అని సుష్మితా దేవ్ ట్వీట్ చేశారు. దాన్ని ప్రియాంక రీట్వీట్ చేయడమే కాక, ‘‘…ఎవరూ ఈ విషయం గుర్తుపట్టలేదనుకుంటా!!” అని కామెంట్ కూడా పెట్టారు.
…and I thought no one noticed!! ? https://t.co/neQADGP35y
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 14, 2019