తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్టయ్యే మాట ఇది. ఓ వైపు ఊహించని సమస్య ఎదురైతే మరోవైపు విపక్షాలు టార్గెట్ చేస్తున్న తీరుతో నిజంగా టీఆర్ఎస్ పెద్దలు ఇరుకున పడే సందర్భం.
తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా ఎల్లూరు వద్ద కృష్ణా నది ఒడ్డున ఉన్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ప్రమాదం జరిగింది. పథకం మొదటి దశ లిఫ్టు పంపుహౌస్ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, దీనిపై విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి.
అసలేం జరిగింది?
గత శుక్రవారం సాయంత్రం పంపింగ్ నడుస్తున్న సమయంలో ఉన్నట్లుండి మోటార్ బిగించిన ఫౌండేషన్ బోల్టులు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. దీంతో పంప్హౌస్ గోడని చీల్చుకొని ఫౌండేషన్ రాడ్లు, మోటార్ల పరికరాలు దూసుకపోవడంతో సర్జిపూల్ నుంచి వరదనీరు ఒక్కసారిగా పంప్హౌ్సలోకి చేరింది. నీటిని ఆపే అవకాశం లేకపోవడంతో కొన్ని నిమిషాల్లోనే పంప్హౌ్సలోని 14 అంతస్తులకు గాను పది అంతస్తుల్లోకి నీరు చేరిపోయింది. ప్రమాదం సాయంత్రం నాలుగుగంటల సమయంలో జరిగినా ఆరు గంటల వరకు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చినా, బాహ్య ప్రపంచానికి తెలియలేదు. సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో విషయం బయటకు పొక్కడంతో విపక్షాలు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశాయి. ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వాల వైఫ్యలం కారణంగానే సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని నిరంజన్రెడ్డి చెప్పారు. పంపింగ్ ప్రారంభించే క్రమంలో నీళ్లు పంపింగ్ స్టేషన్లోకి వచ్చినట్లు ప్రాథమికంగా నివేదిక అందిందని ఆయన పేర్కొన్నారు.
ఏడేళ్లు అయినా… ఏంటిది కేసీఆర్ ?
కాగా, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కామెంట్లపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా.. ఇంకా గత పాలకులు అనేందుకు సిగ్గుండాలని ప్రభుత్వంపై ఆయన ఫైరయ్యారు. గత పాలకులు అంతా మంచే చేశారు.. మీరు అధికారంలోకి వచ్చాకే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని భట్టి మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రం ఏమవుతోందోనన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉందని ఆయన అన్నారు. గతంలో శ్రీశైలం దగ్గర జెన్ కోలో పెద్ద ప్రమాదం జరిగింది..అనంతరం రాత్రి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో మరో ప్రమాదం సంభవించింది. వరుసగా ఇన్ని ప్రమాదాలు ఎందుకు జరగుతున్నాయో అర్థం కావడం లేదని అన్నారు. “కల్వకుర్తి లిఫ్ట్ లో.. పంప్ మూడో మొటార్ ఆన్ చేయగానే కింద భూమి కదలడమేంటి..?? అక్కడ పగుళ్ళు రావడమేంటి..?? నీళ్లన్నీ పంప్ హౌస్ లోకి రావడమేంటి..?? అసలు ఏమి జరగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే మంత్రి నిరంజన్ రెడ్డి అక్కడకు వెళ్లి.. గత పాలకుల వల్ల ఇది జరిగిందనడం హాస్యాస్పదంగా ఉంది“ అని భట్టి అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా గత పాలకులు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు.
తప్పులన్నీ చేసేశావు కేసీఆర్
తెలంగాణ మొదటి శాసనసభ సమావేశాల్లో అప్పటి కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి సభలో పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబందించి ఉపరితలంమీద పెట్టాల్సిన పంపులను అండర్ గ్రౌండ్ లో పెట్టడం కోసం అక్కడ బ్లాస్టింగ్ చేస్తే.. పక్కనే ఉన్న కల్వకుర్తి లిఫ్ట్ కు ప్రమాదమని చెప్పిన విషమాన్ని ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు. ఇదే పరిస్థితిని ఈ ప్రభుత్వం నియమించిన మూడు టెక్నికల్ కమిటీలు చెప్పాయని భట్టి ఈ సందర్బంగా వివరించారు. కేవలం కాంట్రాక్టర్ల కోసమే మోటార్లు గ్రౌండ్ లోపల పెట్టారని తీవ్రస్తాయిలో విమర్శలు చేశారు. ఉపరితలం మీదనే మోటార్లు పెట్టాలని రెండు, మూడో టెక్నికల్ కమిటీ చెప్పిన విషయాన్ని భట్టి మీడియాకు వివరించారు. అండర్ గ్రౌండ్ లో మోటార్లు పెడితే.. కచ్చితంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు ప్రమాదమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం కాంట్రాక్టరలకు లబ్ది చేకూర్చడం కోసం.. టెక్నికల్ టీమ్ చెప్పిందానికి భిన్నంగా చేశారని అన్నారు. తప్పులన్నీ కేసీఆర్ ప్రభుత్వం చేసి.. గత పాలకులపై నిందలను ఎత్తేస్తున్నారని అన్నారు.