(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
చెన్నై: రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలకబోతున్నారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. రాజకీయాల్లో తన పాత్రపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ అధినేతగానే ఉంటాననీ పేర్కొన్న రజినీ ఉన్నత విజ్ఞానవంతుడిని సిఎం సీటులో కూర్చోబెడతాననీ ప్రకటించారు.
2021 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రజనీ కాంత్ నేడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని రజినీ మక్కల్ ముంద్రం ఆఫీస్ బేరర్లతో గురువారం ఆయన సమావేశమై తన ఆలోచనా విధానాలను స్పష్టం చేశారు.
15 సంవత్సరాలుగా తన రాజకీయ ప్రవేశంపై అనేక ఊహాగానాలు వచ్చాయనీ, వాటికి స్వస్తిపలకాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 2017లోనే రాజకీయ ప్రవేశంపై వివరణ ఇచ్చినట్లు పేర్కొన్న రజినీ నాటి నుండి తమిళనాడు పరిస్థితులు విశ్లేషించడం ప్రారంభించానన్నారు.
రాజకీయ నాయకులకు ప్రజలంటే కేవలం ఓట్లేనని వ్యాఖ్యానించారు. వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందనీ, వ్యవస్థను మార్చకుండా మార్పు రాదనీ ఆయన పేర్కొన్నారు. పాటిటిక్స్ను పార్టీలు వ్యాపారంగా మార్చేశాయిని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యధిక మంది పార్టీలో భాగస్వాములయ్యేలా చూసుకుంటానని చెప్పారు. తనకు మూడు ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. జయలలిత మృతి తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందనీ, అప్పుడే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానని చెప్పారు.
ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఎమ్మెల్యేలు, ఎంపిల పిల్లలకే అవకాశాలు వస్తున్నాయని అన్నారు. తాను 60 నుండి 65 శాతం యువతకు సీట్లు ఇస్తానని ప్రకటించారు. రిటైర్డ్ ఐఎఏస్, ఐపిఎస్లను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తానని అన్నారు. అన్ని పార్టీలలో సిఎంగా పార్టీ అధినేతలే ఉంటున్నారనీ, ప్రభుత్వం, పార్టీలపై ఒకే వ్యక్తి పెత్తనం సరికాదనీ అన్నారు. ఈ పార్టీలో తాను పార్టీ అధినేతగా మాత్రమే ఉంటాననీ, సిఎం పదవిపై తనకు వ్యామోహం లేదనీ స్పష్టం చేశారు. తాను పార్టీ అధ్యక్షుడిగానే ఉండి బాగా చదువుకున్న విజ్ఞానవంతుడినే సిఎంని చేస్తానని రజినీ ప్రకటించారు. నిజాయతీపరులకు తన పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో డిఎంకే, ఏఐడిఎంకేలను తన పార్టీ వ్యతిరేకిస్తుందని రజినీ పేర్కొన్నారు.
సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన ఎంజిఆర్, ఎన్టిఆర్, జయలలిత ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పగా తమిళనాడులో విజయకాంత్, కమలహసన్, ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంతగా ప్రభావం చూపలేకపోయారు. సినీ నటులకు లక్షలాది మంది అభిమానులు, మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కొందరు మాత్రమే రాజకీయాల్లో సక్సెస్ అవుతున్నారు. రజినీ పార్టీ ఏ మేరకు విజయం సాధిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.