మాజీ మంత్రి కొల్లు రవీంద్రని కృష్ణా జిల్లా పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బందరు లోని వైసీపి నాయకుడు మేకా భాస్కర్ రావు హత్య కేసులో రవీంద్రను కూడా నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కొల్లు రవీంద్ర రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ బలమైన ఆరోపణలు బయటికి తీసుకు వస్తోంది. పోలీసులను సూటిగా ప్రశ్నిస్తుంది. దీనిపై న్యాయనిపుణులతో చర్చించి పోలీసులను, ప్రభుత్వాన్ని కోర్టు ముందు దోషులుగా నిలబెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ నేత కొమ్మరెడ్డి పట్టాభిరామ్ ఈ రోజు కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు. ఆ ప్రకారం కొల్లు రవీంద్ర కేసు విషయంలో టిడిపి ఎంత పట్టుదలతో ఉందో అర్థమవుతోంది.
పోలీసులు దొరికినట్లేనా..?
29వ తేదీ ఉదయం భాస్కరరావు హత్య జరిగే సమయానికి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కార్యాలయంలోనే ఉన్నారని, వారితో మీటింగ్ విషయమై మాట్లాడారని టిడిపి ఆధారాలను బయటపెట్టింది. కానీ ఆ సమయంలో నిందితులతో కొల్లు రవీంద్ర మాట్లాడారని పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొనడాన్ని టిడిపి తప్పుపట్టింది. తాము ఆధారాలు చూపిస్తున్నా మనీ, పోలీసులు కూడా నిందితులతో మాట్లాడుతున్నట్టు ఆధారాలు చూపించాలని కోరింది. ఇదే సమయంలో జూన్ 29 రాత్రే భాస్కర్ రావు హత్య కేసులో కొంత మంది ప్రధాన నిందితుడు స్టేషన్ కు వచ్చి లోంగి పోయారని, ఆ తర్వాత రోజు సాక్షి పత్రిక లో కూడా లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయనీ కానీ జూలై రెండవ తేదీన వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ఎలా చెబుతారనీ, ఈ మధ్యలో రెండు రోజుల్లో ఏం జరిగింది అని పోలీసు లను పట్టాభిరామ్ ప్రశ్న వేశారు. ఇలా కొల్లు రవీంద్ర కేసులో తెలుగుదేశం పార్టీ బయటపెట్టిన ఆధారాలు కృష్ణాజిల్లా పోలీసులకు ఇప్పుడు చెమటలు పట్టిస్తున్నాయి. హత్య జరిగిన సమయానికి ఆయన కలెక్టర్ ఆఫీస్, ఎస్ పీఆఫీస్ లో ఉండటం నిజమే అయితే పోలీసులు నిందితులతో మాట్లాడుతున్నట్టు ఎలా రుజువు చేయగలరు. అలాగే జూన్ 29వ తేదీనే నిందితులు లొంగిపోయిన లను మాట వాస్తవం అయితే జూలై 2వ తేదీన అరెస్టు చేసినట్టు ఎందుకు చూపించారు. అలాగే ఎఫ్ఐఆర్ లో ఏ 3, ఏ 5 పేర్లు లేకుండా ఖాళీగా ఉంచిన పోలీసులు..చార్జిషీట్ లో మాత్రం ఏ 3, ఏ 5 లను అరెస్టు చేశామని ఎలా చూపించారు? పేరు నమోదు చేయకుండా చార్జిషీట్ లో అరెస్ట్ చేసినట్లు చూపిస్తే చెల్లుతుందా? ఇలా కొత్త అనుమానాలు తెలుగుదేశం పార్టీ లేవనెత్తింది. వీటిపై పోలీసుల సరైన సమాధానం చెప్పకోకపోతే కోర్టు ముందు దోషులుగా నిలబడవలసిన వస్తుంది.
సాధ్యమైనంతగా పోరాడే దిశగా టిడిపి
అచ్చెన్నాయుడు కేసు విషయంలో పది రోజుల పాటు బలంగా పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ..కొల్లు రవీంద్ర కేసు విషయంలో కూడా అదే స్థాయిలో పోరాటం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దర్నీ బయటకు తీసుకువచ్చి తమ పట్టు నిరూపించుకోవాలని తెలుగుదేశం పార్టీ కోర్టులనే నమ్ముకుంది. అందుకే తగిన ఆధారాలు సేకరిస్తూ, బలమైన న్యాయవాదులను నియమించుకుని కోర్టు ముందు వాదించే ప్రయత్నాలు చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు, కృష్ణాజిల్లాలో కొల్లు రవీంద్ర బలమైన నాయకులుగా ఉన్నారు. వారితో పాటు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు వంటి నాయకులపై కూడా కేసులు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం పోలీసులు పెట్టిన కేసుల నుంచి బయటపడటమే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు పెద్ద పనిగా మారింది. తాజాగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, కుమారుడు, అతని పీఎస్ పై కూడా ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణలు రావడం, వారినీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండడం తో తెలుగుదేశం పార్టీ మరింత అప్రమత్తమైంది.