అమరావతి: టిడిపి నేత నారా లోకేష్పై వైసిపి రాజ్యసభ సభ్యుడి విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. 420 తాతయ్య విజయసాయిరెడ్డి అంటూ బుద్దా ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
‘420 తాతయ్య విఎస్ రెడ్డి నీకు సిగ్గు అనే ఐటెం లేదా’ అని బుద్దా ప్రశ్నించారు. రైస్ మిల్లర్ల నుండి జె ట్యాక్స్ వసూలు చేసుకున్నారనీ బుద్దా ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలకు చెడిపోయిన బియ్యం పంపిణీ చేస్తోందని బుద్దా విమర్శించారు. దమ్ముంటే విజయసాయిరెడ్డి, వారి పేపరు ప్రతినిధులు శ్రీకాకుళం జిల్లా వెళ్లి ప్రజల ముందు నిలబడండి అని బుద్దా అన్నారు. ప్రజలు బడిత పూజ చేస్తే సన్నగా తయారు అవుతారనీ, అప్పుడు అర్థం అవుతుంది ఏవరు మాలోకమో అని బుద్దా వ్యాఖ్యానించారు.
ఉద్దానం బాధితుల కష్టాలు తెలుసుకొని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి పెన్షన్, ఎన్టిఆర్ సుజల వాటర్ ప్లాంట్లు, ఫ్రీ డయాలసిస్ సెంటర్లుతో పాటు విజయసాయి చెబుతున్న 200 పడకల ఆసుపత్రికి ప్రణాళిక కూడా చంద్రబాబు హయాంలోనే ప్రారంభం అయ్యిందేనని బుద్దా పేర్కొన్నారు. టిడిపి హయాంలో ప్రారంభం అయిన సంక్షేమ కార్యక్రమాలకు తాను తండ్రి కాలేడనీ, ఏదైనా కొత్తగా ట్రై చేయాలని విజయసాయిరెడ్డికి బుద్దా సూచించారు.