అమరావతి: రాజధాని అమరావతిలో ఒక్క అంగుళం భూమి వుందని రుజువు చేస్తే ప్రభుత్వానికి రాసి ఇస్తానని విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని సవాల్ విసిరారు. వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణపై ఆయన స్పందించారు.
‘అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపునకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా? చంద్రబాబు, సుజనా, కేశినేని, సిఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, ‘కావాల్సిన’ వాళ్లు. వేల ఎకరాల భూములు రైతులను మోసం చేసి కొన్నారు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వీరి ఏడుపు.’ అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు.
దీనిపై కేశినేని స్పందిస్తూ ‘నాకు గానీ, నా కుటుంబానికి కానీ, నాకు సంబంధించిన వారికి కానీ అమరావతిలో ఒక్క అంగుళం భూమి వుందని రుజువు చేస్తే ప్రభుత్వానికి రాసి ఇస్తా, లేకుంటే విజయసాయిరెడ్డి ఏంచేస్తారో కొంచం చెబుతారా’ అని ప్రశ్నించారు.