తెలంగాణ ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నారుట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపిలో మంచి వాగ్దాటి ఉన్న నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి రాష్ట్ర విభజన తరువాత ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లడం, అనంతరం పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన సొంత నియోజకవర్గంలో కొడంగల్లు నియోజకవర్గంలో పరాజయం పాలైనా తదుపరి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటీ చేసి విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కెసిఆర్ పై దూకుడుగా వెళుతున్న రేవంత్ రెడ్డికి ప్రస్తుతం కాంగ్రెస్ పాార్టీలోనే సహాయ సహకారాలు కొరవడ్డాయి అంటున్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి గౌరవించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి దక్కితే పార్టీలో కొనసాగాలనీ లేకపోతే ప్రాంతీయ పార్టీ పెట్టి ముందుకు సాగాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ముందు నుండి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలైన వి హనుమంతరావు, జగ్గారెడ్డి వంటి నాయకులు బహిరంగంగానే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మరో పక్క పిసిసి అధ్యక్ష పదవి రేసులో రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొమటిరెడ్డి రాజగోపాలరెడ్డి లు ఉన్నారు.
వారి ప్రయత్నాల్లో వారూ ఉన్నారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి దక్కకుండా ఉండటానికి ఈ నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వారి అనుకూల వర్గం కూడా ఉంది. అయితే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అనుచరులకూ సరైన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో భాాగంగా ప్రాంతీయ పార్టీ పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నదానిపై ఆయన కసరత్తు చేస్తున్నారనీ, మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయనకు మద్దతుగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుకునేందుకు ఇప్పటికే రేవంత్ రెడ్డి 15 మంది బృందంతో ఇటీవల సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో సర్వే జరగకపోయినా సర్వే చేసిన మేరకు దక్షిణ తెలంగాణ నుండి రేవంత్ రెడ్డికి సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఉత్తర తెలంగాణ నుండి పెద్దగా మద్దతు లభించలేదని తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నల్లగొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాలలో రేవంత్ రెడ్డికి అనుకూల వాతావరణం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో సారి విస్తృత స్థాయి నిర్వహించాలనీ, పిసిసి పదవి ఇస్తే కొనసాగడం లేకపోతే ప్రాంతీయ పార్టీ ద్వారా ముందుకు సాగాలని యోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంపై రేవంత్ రెడ్డి బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఏమి జరగనుందో వేచి చూడాలి.