(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నెలాఖరు వరకు పొడిగించాలని పొరుగు రాష్ట్రాల సీనియర్ ముఖ్యమంత్రులు కోరుతుండగా ఏపి సిఎం జగన్ మాత్రం లాక్ డౌన్ పాక్షికంగా సడలించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్ లో జగన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనితో జగన్ రూటే సపరేటు అని మరోసారి రుజువు అయింది. దక్షిణాది రాష్ట్రాల్లో తొలి సారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన విషయంలో సీనియర్ లు సైతం ఆచ్చర్యపడేలా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ప్రతిపక్షాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నా, కోర్టుల నుండి అక్షింతలు పడుతున్నా తన నిర్ణయాల్లో వెనుకడుగు వేయకుండా కొంత దూకుడుగా ముందుకే వెళుతున్నారు.
ముఖ్య మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి జగన్ నిర్ణయాలు పరిశీలన చేసినట్లయితే ఆయన రూటే సపరేట్ అన్న విషయం ఎవరికైనా బోధపడుతుంది.
రివర్స్ టెండరింగ్, పిపిఏల సమీక్ష, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రభుత్వ మద్యం షాపుల ఏర్పాటు, మూడు రాజధానుల అంశం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమం ఏర్పాటు, గ్రామ, వార్డ్ వాలంటీర్ ల నియామకం, శాసన మండలి రద్దు తదితర నిర్ణయాల్లో ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదురైనా వెనక్కు తగ్గలేదు. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గించి కొత్త కమిషనర్ ను నియమించారు.
కాగా ఈ నెల 14తో లాక్డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఒక పక్క పొరుగు రాష్ట్రం ఒడిస్సా లో లాక్ డౌన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ అక్కడి సిఎం నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకోగా తెలంగాణలో లాక్డౌన్ కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఒకవేళ కేంద్రం లాక్డౌన్ ఎత్తివేసినా తెలంగాణలో కొనసాగిస్తామని కేసీఆర్ తేల్చి చెప్పారు. మరి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదే బాట పడుతున్నారు. అయితే ఏపీ సిఎం జగన్ మాత్రం లాక్ డౌన్ విషయంలో వారి నిర్ణయాలకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో కరోనా రోగులు 400 మందికి పైగా ఉండటం, ఆరు మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. లాక్డౌన్పై ప్రధాని మోడీ నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్లో ఏపీ సీఎం జగన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రెడ్జోన్లకే లాక్డౌన్ను పరిమితం చేయాలనేది తన అభిప్రాయంగా ఉన్నది. ఏపీలో 37 మండలాలు రెడ్జోన్లో, 44 మండలాలు ఆరెంజ్ జోన్లో ఉండగా 595 మండలాలు గ్రీన్జోన్లో ఉన్నాయని మోదీకి జగన్ వివరించినట్లు సమాచారం.