Tirupathi By Election: తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ ఆరంభమయింది. ప్రస్తుతానికి ప్రశాంతంగా జరుగుతుంది. అధికారులు ఏర్పాట్లు చేసారు. ఓటర్లు లైన్లో ఉండి ఓటేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఎన్నిక అంటే ప్రచారం.., పోల్ మేనేజ్మెంట్.., ప్రలోభం.., అన్నీ ఉంటాయి కదా. తిరుపతి ఉప ఎన్నికల్లో ఒక చిత్రమైన పరిస్థితి ఎదురయింది. ఈరోజు పోలింగ్ అనగా… అర్ధరాత్రి దాటే వరకు ఇరు పార్టీలు కీలక వ్యూహాలు నడిపాయి. అధికార పార్టీ తమ స్టైల్ అధికార రాజకీయం నడపగా.. టీడీపీ అందుకు తగిన ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంది. దొంగ ఓట్లు, పంపిణీలు, ప్రైవేట్ సైన్యం మోహరింపు వంటి రాజకీయాలు కూడా చివర్లో నడిచాయి..!
Tirupathi By Election: వైసీపీ అన్ని రకాలుగా సిద్ధం – వారి లక్ష్యం ఇదే..!!
వైసీపీ ఈ ఉప ఎన్నికకు అన్ని రకాలుగా సిద్ధమైంది. 2019 ఎన్నికల్లో 2 . 28 లక్షల ఓట్లు మెజారిటీతో గెలిచిన వైసీపీ ఈ ఎన్నికల్లో కనీసం 4 లక్షల మెజారిటీతో గెలవాలని లక్ష్యం పెట్టుకుంది. కానీ అది అంత సులువు కాదని అర్ధం చేసుకుంది. అందుకే మొన్న, నిన్న, ఈరోజు తెల్లవారుఝామున అధికార దుర్వినియోగ వ్యూహాలు పన్నింది.
* తిరుపతికి సంబంధం లేని కొంతమంది చిత్తూరు పరిధిలోని ఎమ్మెల్యేలకు టార్గెట్ ఇచ్చి.. డూప్లికేట్ ఓటర్లను సిద్ధం చేసి.. రాత్రికి రాత్రి తరలించినట్టు విశ్వసనీయ సమాచారం. కొందరు డ్వాక్రా సంఘాలకు టార్గెట్లు ఇచ్చి.. వారి సంఘం మొత్తం వైసీపీకి ఓటేసేలా ఒప్పందాలు చేసుకున్నారు. మొత్తానికి బయట ప్రాంతం నుండి కొన్ని వాహనాల్లో తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలకు మనుషులను మాత్రం తరలించారు.
* పంపిణీలో పెద్దగా లేదు. వైసీపీ కేవలం ప్రతీ వాలంటీర్ కి రూ. 5 వేలు, డ్వాక్రా సంఘాల లీడర్లకు రూ. 5 వేలు, ముఖ్యమైన కార్యకర్తలకు రూ. 10 వేలు చొప్పున ఇచ్చారు. పూర్తిగా తమకు అనుకూలంగా పని చేయాలనీ ఆదేశించారు. ఓటర్లకు పెద్దగా పంచలేదు. అడిగిన అతి కొద్దిమందికి మాత్రమే రూ. 1000 చొప్పున ఇచ్చారు.
టీడీపీ ఇలా సిద్ధమైంది.. పట్టు కోసం పాట్లు..!!
మరోవైపు టీడీపీ కూడా ధీటుగానే సిద్ధమైంది. వైసీపీ అనుకున్నట్టు దొంగ ఓట్లు పడకుండా అన్ని రకాలుగా అడ్డుకోవాలని వ్యూహాలు వేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల వరకు చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక్కో బూత్ కి పది మంది కార్యకర్తలను పెట్టాలను.. బయట ప్రైవేట్ సైన్యంగా పాతిక మందిని మోహరించాలని.. మొబైల్ టీమ్ గా మరో పాతిక మందికి పది పోలింగ్ కేంద్రాలకు తిరిగేలా చూడాలని వ్యూహాలు వేసుకున్నారు.
* డబ్బు పంపిణీ పెద్దగా లేదు. కొన్ని నియోజకవర్గాల్లోని కీలక ప్రాంతాల్లో మాత్రమే ఇచ్చారు. మిగిలిన చోట ముఖ్యమైన నాయకులకు చేర్చారు. అధికార పార్టీ ఏమైనా అక్రమాలకు పాల్పడితే పూర్తిస్థాయిలో అడ్డుకోవాలని టీడీపీ సిద్ధమైంది. ప్రచారంలో బాగానే దూసుకొచ్చిన టీడీపీ ఈ రోజు పోలింగ్ లో కూడా చురుగ్గా పని చేస్తే ఫలితం ఉంటుందని ఆశిస్తుంది.
మొత్తానికి పూర్తస్థాయిలో డబ్బులు పంపిణీ చేయని ఎన్నికగా తిరుపతి ఉప ఎన్నిక నిలిచిపోనుంది. వైసీపీ ఈ సరి విభిన్నంగా వివిధ వర్గాలకు ఇచ్చింది. టీడీపీ కూడా ఓటర్లకు ఇవ్వలేదు. పది లక్షల ఓటర్లకు ఇవ్వడం కంటే ఓటు వేయించే స్థాయిలో ఉన్నవారికి ఇవ్వడం మంచిదని పార్టీలు భావించినట్టున్నాయి. పోలింగ్ శాతాన్ని బట్టి ఈ ఎన్నిక ఫలితం ఉండబోతుంది.