Tirupathi By Election : రాష్ట్రంలో అధికార పార్టీకి తిరుగులేదు. ఎక్కడ, ఏ ఎన్నిక జరుగుతున్నా వైసీపీకి భారీగా ఓట్లు పడుతున్నాయి. భయమో, అభిమానమో.. కారణం ఏమైనా కానీ వైసీపీకి గెలుపు మాత్రం లాంఛనంగా దక్కుతుంది. సో.. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి అంటే.., తిరుపతి ఎంపీ సీటు ఉప ఎన్నికలో కూడా వైసిపికి గెలుపు ఈజీ టాస్క్. కాకపోతే మెజారిటీ ఎంత..? అనేది లెక్కించుకోవాలి. టీడీపీ ఎంత పోరాడినా.., బీజేపీ ఎంతగా ప్రయత్నించినా వారి ఉనికి, భవిష్యత్తు కోసమే తప్ప, ఇప్పుడు గెలుపు కోసం అనే విషయం వారికీ అంతర్లీనంగా తెలుసు. ఇంతకూ టీడీపీకి ఎన్ని ఓట్లు వస్తే రాజకీయంగా గిట్టుబాటు అయినట్టు.., బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తే రాజకీయంగా గిట్టుబాటు అయినట్టు అనేది కొంచెం లోతుగా చూద్దాం..!!
Tirupathi By Election : టీడీపీకి బలం అలా ఉంటే చాలు..!!
తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో మొత్తం 14 లక్షల ఓట్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి 7 .22 లక్షల ఓట్లు.., టీడీపీ అభ్యర్థికి 4 . 94 లక్షల ఓట్లు వచ్చాయి. జనసేన, బీజేపీకి కలిపి 37 వేల ఓలు వచ్చాయి. ఆ ఎన్నికలు ముగిసినప్పటి నుండి టీడీపీ మరింత బలహీన పడుతుంది. పార్టీలో కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారు. నాయకత్వం నీరసిస్తుంది. వరుస ఓటములు, నాయకుల్లో నిలకడలేమి ఆ పార్టీని వేధిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ తిరుపతి ఉప ఎన్నికలో గెలిస్తే పెద్ద సంచలనమే. అందుకే కనీసం గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు నిలబెట్టుకుంటే టీడీపీ నైతికంగా గెలిచినట్టే. బలం నిలుపుకున్నట్టే. టీడీపీ రాజకీయంగా గిట్టుబాటు చేసుకున్నట్టే. అంటే ఆ పార్టీ టార్గెట్ 5 లక్షల ఓట్లు. తమ సొంత సామాజికవర్గం, చంద్రబాబు సొంత బలగం, పార్టీ క్యాడర్ ద్వారా ఈజీగా మూడు లక్షల ఓట్లు వస్తాయి. మిగిలిన రెండు లక్షల ఓట్లు వస్తే టీడీపీ గట్టెక్కినట్టే. ఏ మాత్రం దిగులు చెందకుండా ఆ పార్టీ నిశ్చింతగా ఉండవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీడీపీకి 5 లక్షల ఓట్లు రావడం కూడా కష్టమే. ఆ పార్టీ ప్రయత్నాలు, ప్రచారాలు ఎంత మేరకు ఫలిస్తాయో చూద్దాం..!
బీజేపీ – జనసేన బలం/ బలుపు/ వాపుకి పరీక్ష..!!
బీజేపీ ఏపీ నేతలు ఈ మధ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తమ పార్టీకి ఏపీలో బీభత్సంగా ఓటు బ్యాంకు పెరిగినట్టు.., ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 30 శాతం ఓట్లు వచ్చేస్తాయి అన్నట్టు తెగ మాట్లాడుతున్నారు. వారికి జనసేన తోడైతే ప్రభుత్వమే ఏర్పాటు చేసేస్తాం అంటున్నారు. సో… ఆ బలం ఏమిటో.. అది బలుపా/ వాపా అనేది తేలిపోనుంది. అభ్యర్థి ఎంపిక ద్వారా బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయినట్టు సంకేతాలు ఇచ్చింది. సరైన అభ్యర్థిని రంగంలోకి దించింది. జనసేన, బీజేపీ కి ఉన్న ఓటు బ్యాంకు చూసుకుంటే 50 వేలు ఓట్లు వరకు ఢోకా లేదు. కానీ ఆ పార్టీలు బలం పెరిగింది.., మాకు తిరుగులేదు అంటున్నాయి కాబట్టి కనీసం లక్ష ఓట్లు తెచ్చుకుంటే ఆ పార్టీలకు తిరుగులేనట్టే. ఏపీలో రాజకీయ భవిష్యత్తుపై ఆ పార్టీలు ఆశలు పెట్టుకోవచ్చు..! అంటే టీడీపీకి 5 లక్షలు, బీజేపీకి లక్ష ఓట్లు వస్తే ఆ ఎన్నిక త్రిముఖ పోరు ప్రకారం జరిగినట్టే, వైసిపికి గట్టి పోటీ ఎదురైనట్టే చెప్పుకోవచ్చు..!!