విజయవాడలోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన దారుణ సంఘటన గురించి తెలిసిందే. రమేశ్ హాస్పిటల్స్ కు అనుబంధంగా హోటల్ స్వర్ణపాలెస్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మరణించారు. ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. కోవిడ్ వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్స్ కు అనుమతులిచ్చినా సదుపాయాల కల్పన వంటి అంశాలను పట్టించుకోవాల్సిందే. కానీ అధికారులు ఇవేమీ చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యం అంటూ ఈ పరిస్థితిని ప్రతిపక్షాలు వదులుకోవు. కానీ.. టీడీపీ, జనసేన మాత్రం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సింది పోయి.. కనీసం ఈ విషయంపై స్పందించటం లేదు.
నిజానికి రమేశ్ హాస్పిటల్స్ స్వర్ణ పాలెస్ లో కోవిడ్ చికిత్సకు అనుమతులు లేవు. ప్రమాదం జరిగే వరకూ అక్కడ హోటల్ ను అద్దెకు తీసుకున్నట్టే ఎవరికీ తెలీదు. హోటల్ ను అద్దెకు తీసుకోవటం వరకే తమ బాధ్యతని.. సదుపాయాలు కల్పించాల్సింది హోటల్ యాజమాన్యమే అని రమేశ్ చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. రమేశ్ మాత్రం పరారీలో ఉన్నారు. ఆయన కోసం ఎనిమిది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత స్వర్ణ ప్యాలెస్ పలు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుందని కూడా వార్తలు వచ్చాయి. పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే అవకాశం చంద్రబాబుకు, పవన్ కు వచ్చింది. అయినా వారిద్దరూ మాట్లాడటం లేదు.
రాజధాని ఇక్కడే ఉంచాలంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ.. ప్రభుత్వ తీరును తప్పుపట్టే ఈ ఇద్దరు నాయకులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ సమయంలో మరోసారి చంద్రబాబు కుల రాజకీయాలకు తెర లేపారే విమర్శలు వస్తున్నాయి. విశాఖ ఘటనపై ఇప్పటికీ మాట్లాడే చంద్రబాబు విజయవాడ ఘటనపై మౌనం రమేశ్ తో ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమంటున్నారు. అమరావతి భూముల్లో కూడా వీరిద్దరి మధ్య లాలూచి ఉందనే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబుతో పవన్ కు లోపాయకారి ఒప్పందం ఇప్పటికీ ఉంది కాబట్టే పవన్ కూడా స్పందించటం లేదని విమర్శలు వస్తున్నాయి. ‘లోగుట్టు.. చంద్రబాబు, పవన్ కే ఎరుక’.