ఏపీ అసెంబ్లీలో జనసేనకు ప్రాతినిధ్యం లేకుండా…
తెర పైకి కొత్త ప్రతిపాదన..తెలంగాణలో తరహాలోనే..!
ఏపీ అసెంబ్లీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా. జనసేన పార్టీ వైసీపీలో విలీనం కాబోతుందా. తాజాగా..జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి. 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుండి గెలిచి జనసేన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పటి నుండి ఆయన తమ పార్టీ అధినేత పవన్ కళ్యాన్ వైఖరికి భిన్నంగా అసెంబ్లీలో వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ను ప్రతీ నిర్ణయంలోనూ..అన్ని సందర్భాల్లోనూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇసుక వివాదం..ఇంగ్లీషు మీడియం విద్యా భోధన ఇలాంటి నిర్ణయాల ను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించటం..ఇక్కడ ఆయన సారధ్యంలోని పార్టీ ఎమ్మెల్యే సమర్ధించటం ఆనవాయితీగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే రాపాక తన మనసులో భావాలను అసలు దాచుకో కుండా..మొత్తంగా బయట పెట్టేసారు. అయితే, దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీతో జత కట్టిన జనసేనకు భారీ షాక్ ఇచ్చేలా వ్యూహాలు సిద్దం అవుతున్నట్లు సమాచారం…
అసెంబ్లీలో..విలీనం ప్రక్రియ పై చర్చ…
ఏపీ అసెంబ్లీలో జనసేన ఏకైక ఎమ్మెల్యే ఇప్పుడు హట్ టాపిక్ గా మారారు. రాపాక తాజాగా చేసిన వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం వేరనే ప్రచారం సాగుతోంది. రాపాక తాను వైసీపీతో సఖ్యతగా..సీఎం జగన్ తో సన్నిహితంగా ఉంటున్నా..ఆయన పైన జనసేనాని ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. క్రమశిక్షణా చర్యల దిశగానూ చర్యలు లేవు. ఇదే అంశం పైన కాకినాడలో పవన్ ను ప్రశ్నించిన సమయం లో తమ ఎమ్మెల్యే మీద ఎటువంటి ఒత్తిడి ఉందో అంటూ వ్యాఖ్యానించారు. దీని ద్వారా పవన్ సైతం తన ఏకైక ఎమ్మెల్యే తనత ఉండరనే నిర్ణయానికి ఎప్పుడో వచ్చారని స్పష్టమవుతోంది. ఇక, పార్టీ పరంగా ఏర్పాటు చేసిన కీలక కమిటీల్లోనూ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాపాకకు స్థానం కల్పించలేదు. అయితే, ఇప్పుడు టీడీపీ నుండి వైసీపీకి దగ్గరైన ముగ్గురు ఎమ్మెల్యేల్లో వల్లభనేని వంశీ తనను టీడీపీ సస్పెండ్ చేసిందని.. తనను స్వతంత్ర ఎమ్మెల్యేగా గుర్తిస్తూ..విడిగా సీటు కేటాయించాలని స్పీకర్ ను కోరగా..ఆయన అందుకు సమ్మతించారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో టీడీపీ బెంచ్ లకు దూరంగా ఉంటున్నారు. ఇక, ఇప్పుడు జనసేన నుండి ఏకైక ఎమ్మెల్యే కావటంతో రాపాక..సీటు మార్పు గురించి కాకుండా..నాడు తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేల మెజార్టీ నిర్ణయం మేరకు అధికార టీఆర్ఎస్ లో విలీనం చేస్తూ నాటి తెలంగాణ స్పీకర్ నిర్ణయిం తీసుకున్నారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో సైతం రాపాక ద్వారా అదే ప్రయత్నం చేయించే అంశం మీద చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
సరైన సమయం కోసం నిరీక్షణ…!
తాను ఎన్నికైన జనసేన ను గాలి పార్టీగా విమర్శించిన ఎమ్మెల్యే రాపాక ఉద్దేశ పూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల ద్వారా జనసేన అధినాయకత్వం ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసినా..బహిష్కరించినా..అధికారికంగా వైసీపీలో చేరటానికి రాపాకకు లైన్ క్లియర్ అవుతుంది. ఇప్పటికీ జనసేన అధినాయకత్వం ఈ వ్యాఖ్యలను సైతం పట్టించుకోకుండా..రాపాక విషయంలో ఇదే విధంగా కొన సాగితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా తానే ఏకైక ఎమ్మెల్యే కావటంతో తాను జనసేన నుండి ఏకైక ఎమ్మెల్యేను…వైసీపీలో విలీనం చేస్తున్నానంటూ స్పీకర్ కు అధికారికంగా లేఖ ఇస్తే ఇక అది వెంటనే అమలు చేయటం స్పీకర్ కు కష్టమేమి కాదు. ఎందుకంటే ఈ నిర్ణయాన్ని విభేదించటానికి అసెంబ్లీలో జనసేనకు మరో ఎమ్మెల్యే లేరు. అదే విధంగా జనసేన పార్టీ సైతం బయట విమర్శలు చేయటం మినహా.. అసెంబ్లీ లో ఆ ప్రక్రియ తెర మీదకు వస్తే అడ్డుకొనే పరిస్థితి ఉండదు.
నెక్ట్ టార్గెట్ టీడీపీయే
అయితే, ఇటువంటి నిర్ణయం తీసుకోవటం ద్వారా ప్రజల్లోకి తమ ప్రభుత్వం పైన..ముఖ్యమంత్రి జగన్ పైన ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుందీ…అది జగన్ ఇమేజ్ కు ఏమైనా నష్టం చేస్తుందా అనే కోణంలో మాత్రమే ఇప్పుడు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, జనసేన ఎమ్మెల్యే అటువంటి అభిప్రాయం ప్రజల్లో కలగకుండా ముందస్తుగానే జనసేనను తూర్పార బడుతూ..సీఎంను ప్రశంసిస్తూ అది తన నిర్ణయమే అనే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. దీంతో..అసెంబ్లీలో జనసేనకు ప్రాతినిధ్యం లేకుండా చేయటం..టీడీపీ ఎమ్మెల్యేలు తమతో వచ్చే వారిని అధికారికంగా చేర్చుకోకుండా..ముందుగా టీడీపీకి దూరం చేసి..ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టటమే తమ వ్యూహాలుగా వైసీపీ అడుగులు వేస్తోంది.