ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తల పెట్టిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మరో సారి వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుంటే టీడీపీ అడ్డుకుంటోంది అని వైకాపా ఆరోపిస్తుండగా… ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో అధికార వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్ష టీడీపీ విమర్శిస్తోంది. మరో వైపు నేతలు సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ అంశంపై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మధ్య ట్వీట్ వార్ జరిగింది.
” జగన్ గారి ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తుంటే నిరసనలకు పిలుపు నిచ్చాడు ఒక గుడ్డి విజనరీ. హైదరాబాద్ లో ఉంటూ జూమ్ యాప్ ద్వారా కుట్రలు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం. ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం. ఇంకెంత దిగజారతావు బాబూ? 2024 లో నీ అడ్రస్ గల్లంతే ” అంటూ విజయసాయి రెడ్డి..చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
దీనికి టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చారు. “వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల అమ్మకం కార్యక్రమాన్ని మూడో సారి వాయిదా వేసాడు సైకో ప్రిజనరీ. సహజీవనం అన్న మేధావి ఇప్పుడు కరోనా కారణం గా ఇళ్ల పట్టాలు అమ్మకం వాయిదా పడింది అనడం విడ్డురంగా ఉంది. పట్టాలు అమ్మకం, డబుల్ రేటుకి స్థలాలు కొనడం. అధికార పార్టీ వాళ్లే చెత్త పాలన అంటూ వేరే కుంపటి పెడుతున్నా ప్రిజనరీ దిగజరుతూనే ఉన్నాడు” అంటూ అయ్యన్న పాత్రుడు బదులు ట్వీట్ ఇచ్చారు.