అమరావతి: క్యాబినెట్ మీటింగ్ పేరుతో ‘రోప్ ట్రిక్’కు చంద్రబాబు సిద్దమయ్యాడు అంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. విజయసాయిరెడ్డి తన దిన చర్యలో భాగంగా ట్విట్టర్ వేదికగా ఆదివారంనాడూ విమర్శలు సంధిస్తూ పోస్టులు చేశారు.
చంద్రబాబును ఇంద్రజాలికుడుగా అభివర్ణిస్తూ తన దైన శైలిలో విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి.
‘మేజిక్ షో ఆఖరున ఇంద్రజాలికులు ఇండియన్ రోప్ ట్రిక్ అనే గారడీని ప్రదర్శిస్తారు. తాడు కొన పాములా పైకి వెళ్తుంది. దాన్ని పట్టుకుని ఒకరు పైకి ఎగబాకుతుంటారు. కేబినెట్ మీటింగ్ పేరుతో ‘రోప్ ట్రిక్’కు సిద్ధమయ్యారు చంద్రబాబు. తాడు పైకి ఎగురుతుందో కిందకు జారి పడుతుందో చూడాలి’ అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
మరో ట్వీట్లో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు సిఎస్ ఆయన్ను కలవకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డట్టా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఎవరో డబ్బు సమకూరుస్తారు. ఇంకొకరు ఖర్చు పెట్టి గెలుస్తారు అన్న నోటితో విలువల గురించి చంద్రబబు మాట్లాడటం హస్యాస్పదం అనీ, ఓడిపోయే ముందు అసహనం అమాంతం పెరిగినట్లుందని విజయసాయి రెడ్డి విమర్శ చేశారు.