న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులను కొట్టేయాలని ఈసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంతో కమిషన్ లోని ఒక కమిషనర్ అశోక్ లావాసా విభేదించారని ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ తన కథనంలో పేర్కొంది. గుజరాత్ లోని పటన్ లో ఏప్రిల్ 21న మోదీ చేసిన ప్రసంగం కేసును కూడా తాజాగా ఈసీ కొట్టేసింది. భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమాన్ ను వెంటనే తిరిగి పంపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్థాన్ ను హెచ్చరించినట్లు మోదీ అక్కడ చెప్పారు.
ఇంతకుముందు వచ్చిన మెజారిటీ – మైనారిటీ ప్రసంగం కేసు, తొలిసారి ఓటర్లను అమరవీరులకు ఓటును అంకితం చేయాలన్న కేసు విషయంలోనూ లావాసా అభ్యంతరం వ్యక్తంచేశారు. వయనాడ్ ను పాకిస్థాన్ తో పోలుస్తూ అమిత్ షా చేసిన ప్రసంగం కోడ్ ఉల్లంఘన కాదన్న ఈసీ నిర్ణయంతోనే ఆయన విభేదించారు. ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు సుశీల్ చంద్ర, అశోక్ లావాసా ఉన్నారు. మోదీ-షాల విషయంలో నిర్ణయాలన్నీ 2-1 మెజారిటీతోనే తీసుకున్నారు. విభేదించడం అనేది నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా ఆరోగ్యకరమైన విధానమని మాజీ సీఈసీ ఎస్ వై ఖురేషీ అభిప్రాయపడ్డారు.
శనివారం నాటి కేసుతో ఎన్నికల కమిషన్ మోదీకి ఇప్పటివరకు ఉన్న మొత్తం ఆరు ఫిర్యాదులలో క్లీన్ చిట్ ఇచ్చింది. ఒక్క చిత్రదుర్గ కేసు విషయంలో మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పటన్, వారణాసి, బార్మర్ ప్రసంగాల విషయంలో ఈసీ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నారు. సోమవారానికల్లా వారిద్దరిపై ఉన్న కేసులన్నింటినీ తెమల్చాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి ఇంతకుముందు సూచించింది.