దుబాయ్: పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయుడికి జాక్ పాట్ తగిలింది. అక్కడ నిర్వహించిన ఓ లాటరీలో అతడు ఏకంగా రూ. 27.67 కోట్లు గెలుచుకున్నాడు. కేఎస్ షోజిత్ అనే ఆ వ్యక్తి షార్జాలో నివసిస్తాడు. అబుధాబి డ్యూటీ ఫ్రీ బిగ్ టికెట్ సిరీస్ లాటరీలో అతడు ఈ బహుమతి గెలుచుకున్నాడు. విజేతల వివరాలను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో తెలిపారు.
ఏప్రిల్ 1వ తేదీన అతడు ఈ టికెట్ ను ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేశాడు. కానీ, ఇప్పుడు మాత్రం లాటరీ తగిలిన విషయం అతడికి తెలియదు. ఎందుకంటే, లాటరీ కంపెనీవాళ్లు పదే పదే ఫోన్లు చేస్తున్నా.. అవేవో వాణిజ్య కాల్స్ అనుకుని అతడు రిజెక్ట్ చేస్తున్నాడు. తమ కాల్స్ వెళ్లకపోయినా తాము పదే పదే ప్రయత్నిస్తామని అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతినెలా బిగ్ టికెట్ రాఫెల్ నిర్వహించే రిచర్డ్ తెలిపారు. ఒకవేళ షోజిత్ తమ ఫోన్ తీసుకోకపోయినా, అతడు ఎక్కడుంటాడో తెలుసు కాబట్టి నేరుగా ఇంటికి వెళ్లి బహుమతి అందిస్తామని అన్నారు.
ఇదే లాటరీలో మరో భారతీయుడు మంగేష్ మైండే బీఎండబ్ల్యు 220ఐ కారు గెలచుకున్నాడు. మరో ఎనిమిది మంది భారతీయులు, ఒక పాకిస్థానీ కలిసి 9 కన్సొలేషన్ బహుమతులు గెలుచుకున్నారు. గత సంవత్సరం నిర్వహించి రాఫెల్ డ్రాలో కేరళకు చెందిన జాన్ వర్ఘీస్ అనే కారు డ్రైవర్ రూ. 22 కోట్లు గెలచుకున్నారు. జనవరిలో మరో కేరళ వ్యక్తి కూడా ఇంతే మొత్తం లాటరీలో పొందాడు. తాజాగా కన్సొలేషన్ బహుమతులు పొందిన ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ. 1.8 కోట్ల చొప్పున లాటరీ తగిలింది.