లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా వెల్లడి
ఎప్పుడు జరిగాయో చెప్పాలన్న జనరల్ వీకే సింగ్
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో కూడా భారత సైన్యం పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైకులు నిర్వహించిందని రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా తెలిపారు. మోదీయే తొలిసారి ఇలాంటి దాడులు చేయించారని బీజేపీ చెప్పడంతో హూడా స్పందించారు. 2016 నాటి సర్జికల్ స్ట్రైకులలలో ఆయన ప్రధానపాత్ర పోషించారు. సైనికపరంగా ఇది చాలా అవసరమే అయినా.. దానికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, రాజకీయం చేశారని గత సంవత్సరం ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ భద్రత మీద విజన్ డాక్యుమెంటు రూపొందించడానికి కాంగ్రెస్ పార్టీ నియమించిన టాస్క్ ఫోర్సుకు హూడా నేతృత్వం వహించారు.
దాంతో తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లుగానే గతంలో కూడా సర్జికల్ స్ట్రైకులు జరిగాయన్న విషయాన్ని చెప్పారు. 2004 నుంచి 2014 మధ్య ఆరు సార్లు ఇలాంటి దాడులు జరిగాయన్నారు. కానీ మన్మోహన్ సర్కారు మాత్రం వీటిని ప్రచారం చేసుకోలేదన్నారు. అయితే అవి కచ్చితంగా ఎక్కడ, ఎప్పుడు జరిగాయో మాత్రం తనకు తెలియదని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. సైనిక చర్యలను రాజకీయం చేయడం వల్ల సైనిక దళాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని లెఫ్టినెంట్ జనరల్ హూడా అన్నారు. ఆర్మీని ఎన్నికల్లోకి లాగడం ఏ పార్టీకీ మంచిది కాదని తెలిపారు. దీనివల్ల దీర్ఘకాలంలో సంస్థకు విఘాతం కలుగుతుందన్నారు.
కాగా, ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో సర్జికల్ స్ట్రైకులు జరిగాయన్న విషయాన్ని బీజేపీ తిరస్కరించింది. 2016 సెప్టెంబరు 29న చేసినవే మొట్టమొదటివని పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినప్పుడు మిలటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్ చెప్పారన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య చెబుతున్నారని, కొందరు రెండంటే మరికొందరు ఆరు అంటారని, ఇంకొందరు 10 అని చెబుతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లు తమ 24 అక్బర్ రోడ్డు కార్యాలయం నుంచి సర్జికల్ స్ట్రైకులు చేశారా అని ప్రశ్నించారు. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ కూడా కాంగ్రెస్ చెప్పే విషయాలను ఖండించారు. తాను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఉన్న కాలంలో ఎప్పుడు ఆ సర్జికల్ స్ట్రైకులు జరిగాయో తనకు చెప్పాలని ఆయన సవాలు చేశారు.