రాజీవ్ గాంధీపై ప్రధాని మోదీ విమర్శలు
కోర్టు తీర్పు చూడలేదా అన్న చిదంబరం
న్యూఢిల్లీ: రఫేల్ స్కామ్ విషయంలో రాహుల్ గాంధీతో పదేపదే ‘చౌకీదార్ చోర్’ అనిపించుకుంటున్న మోదీ అందుకు బదులుగా ఆయన తండ్రి రాజీవ్ గాంధీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఈ విమర్శలపై స్ంపదనలు తీవ్రస్థాయిలో వచ్చాయి. మరణించిన వ్యక్తిపై బురదచల్లడం ద్వారా మోదీ సభ్యత పూర్తిగా మరిచిపోయారని కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. శనిావారం ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచార సభలో మోదీ రాహుల్ను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘మీ నాన్నను ఆయన అనుంగు అనుచరులు అంతా మిస్టర్ క్లీన్ అన్నారు. చివరికి నంబర్ వన్ అవినీతిపరుడిగా ఆయన జీవితం ముగిసింది’ అన్నారు.
రఫేల్ విషయంలో తనపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీమీద మోదీ మండిపడ్డారు. అధికారం కోసం సిద్ధాంతాలను ఎలా భ్రష్టు పట్టిస్తారో చెప్పడానికి కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ మంచి ఉదాహరణలని అన్నారు.
మోదీ అన్నీ దాటేశారు: చిదంబరం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మర్యాదకు సంబంధించిన అన్ని పరిమితులూ దాటేశారని కేంద్ర మాజీమంత్రి చిదంబరం మండిపడ్డారు. రాజీవ్ గాంధీ మీద మోదీ చేసిన విమర్శలపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాజీవ్ గాంధీపై వచ్చిన ఆరోపణలను మద్రాస్ హైకోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయకూడదని నాటి బీజేపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం మోదీకి తెలుసా.. లేదా అని ప్రశ్నించారు.
మాయావతిని మోసం చేస్తున్నారు
సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని మోసం చేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఆమెను ప్రధానమంత్రిని చేస్తామని నమ్మించాయని చెప్పారు. వాళ్ల ఆటలన్నింటినీ ఆమె బాగా అర్థం చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ మీద ఎస్పీ మౌనాన్ని, అదే సమయంలో రాయ్ బరేలిలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రియాంకాగాంధీ చేసిన ప్రసంగాన్ని ఆయన ప్రస్తావించారు. దాన్ని బట్టే ఆ రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని తెలిసిపోతోందన్నారు. ‘‘పొత్తు రూపంలో మాయావతి అక్క గారి వల్ల సమాజ్ వాదీ పార్టీ ప్రయోజనం పొందింది. కానీ ఆమెను చీకట్లో ఉంచి నక్కజిత్తులకు పాల్పడుతోంది. ఆమెను గౌరవిస్తామని, ప్రధానమంత్రిగా కూడా చేస్తామని వాళ్లు పైకి చెబుతున్నారు. కానీ తెరవెనుక మాత్రం సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పెద్ద కుట్ర పన్నుతున్నాయి’’ అని ఆయన అన్నారు. ‘‘బెహన్ జీ బహిరంగంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటే, సమాజ్ వాదీ పార్టీ మాత్రం తమ స్వార్థంతో, లోలోపల ఉన్న పొత్తుతో కాంగ్రెస్ విషయంలో మౌనం పాటిస్తోంది’’ అని ప్రతాప్ గఢ్ లో బీజేపీ అభ్యర్థి సంగమ్ లాల్ గుప్తా తరఫున ప్రచారం చేస్తూ మోదీ చెప్పారు. యూపీలో మాయావతి, ఎస్పీ ఎవరు అధికారంలో ఉన్నా అంబులెన్సులు గానీ, తాజ్ మహల్ గానీ సురక్షితంగా లేవని, చివరకు పంపులను కూడా వదల్లేదని ఆరోపించారు.
.