అలా చేస్తే సుప్రీంకోర్టుకు చెడ్డ పేరు
బెంచికి చెప్పిన జస్టిస్ చంద్రచూడ్
న్యూఢిల్లీ: ఫిర్యాదు చేసిన మహిళ పరోక్షంలో విచారణ చేయొద్దని, అలా చేస్తే సుప్రీంకోర్టుకు చెడ్డపేరు వస్తుందని సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను విచారిస్తున్న ధర్మాసనానికి ఆయనీ సూచన చేసినట్లు ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ తన కథనంలో పేర్కొంది. 2022 నుంచి 2024 మధ్య ప్రధాన న్యాయమూర్తులు అయ్యేవారి జాబితాలో సీనియార్టీ ప్రకారం జస్టిస్ చంద్రచూడ్ పదోస్థానంలో ఉన్నారు. సహ న్యాయమూర్తి జస్టిస్ రోహిన్టన్ నారిమన్ తో కలిసి ఆయన ధర్మాసనంలో ఉన్న జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలను కలిసినట్లు తెలిసింది. వీరిద్దరూ ప్రస్తుత విచారణ విషయంలో తమకున్న అనుమానాలను ప్రస్తావించారని అంటున్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీలో ఐదోస్థానంలో ఉన్న జస్టిస్ నారిమన్ కొలీజియం సభ్యుడిగానూ ఉన్నారు. ఫిర్యాదుచేసిన మహిళ కొన్ని అనుమానాలు వ్యక్తంచేస్తూ విచారణకు దూరంగా ఉండటంతో జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులకు ఈనెల 2న ఒక లేఖ రాశారు. ఆమె లేకుండా విచారణ కొనసాగిస్తే కోర్టు పేరు ప్రతిష్ఠలు దెబ్బతింటాయన్నారు. విచారణ సమయంలో తనకు న్యాయవాది కావాలన్న ఆమె వినతిని మన్నించాలని లేదా అమికస్ క్యూరీని నియమించాలని కూడా ఆయన సూచించారు. తాను విచారణ నుంచి వైదొలగుతున్నట్లు ఫిర్యాదు చేసిన మహిళ చెప్పడంతో ఆమె లేకుండానే విచారణ కొనసాగించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ముగ్గురు న్యాయమూర్తులు ఏప్రిల్ 30న తీసుకున్నారు.
రెండు సార్లు మూడేసి గంటల చొప్పున విచారణ జరిగిన తర్వాత, మూడోసారి విచారణ ప్రారంభం అయినప్పుడు ఫిర్యాదు చేసిన మహిళ తన నిర్ణయం చెప్పారు. తనకు న్యాయవాది సాయం కావాలని, అది లేకుండా ధర్మాసనం ముందు చెప్పలేనని అన్నారు. దాంతో, తాము ఆమె లేకుండానే ఎక్స్ పార్టీ విచారణ జరుపుతామని న్యాయమూర్తులు చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ బుధవారం నాడు ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. కమిటీ తనను భయపెడుతోందని ఆ మహిళ అన్నారు. విచారణలో తానొక్కరినే ఉండటం వల్ల తనకు భయం, ఆందోళన కలుగుతున్నాయని చెప్పారు.