అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసిపికి షాక్ తగిలింది. వైసిపి నేత, విశాఖ నార్త్ మాజీ ఎమ్మెల్యే టి.విజయకుమార్ శనివారం టిడిపిలో చేరారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు విజయకుమార్ను అమరావతికి తీసుకొచ్చారు. టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా తాను టిడిపిలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నానని విజయకుమార్ తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టిడిపిలో చేరిన అనంతరం విజయకుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసే టిడిపిలో చేరానన్నారు. రాష్ట్ర అభివృద్ధి టిడిపితోనే సాధ్యమని విజయకుమార్ పేర్కొన్నారు. టిడిపి ఈసారి భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని విజయకుమార్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.
విజయకుమార్ 2009 లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరుపున విశాఖ నార్త్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం విజయకుమార్ విశాఖపట్నం ఎంపి స్థానం వైసిపి ఇన్ చార్జీగా ఉన్నారు.