‘బాబును ఇక జనం నమ్మరు’
ఇచ్ఛాపురం, జనవరి 9: రాష్ర్ట ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఇక నమ్మరని వైసిపి అధినేత వైఎస్ జగన్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం వద్ద పాదయాత్రను ముగించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ పరిపాలన పూర్తిగా అవినీతి, అక్రమాల మయం అయ్యిందని ఆరోపించారు.
ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు బిజెపితో కాపురం చేశారని ఆయన అన్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు మోదీతో పోరాటం అంటూ జనాన్ని మోసం చేస్తున్నారని జగన్ విమర్శించారు. గత ఎన్నికల ముందు జాబు కావాలంటే బాబు రావాలన్నారనీ, చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు మాత్రం లేవనీ జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఎన్నికలకు మూడునెలల ముందు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని ఆయన అన్నారు.
అధికారంలోకి రావడానికి తనకు అన్నివర్గాల తోడు కావాలని ఆయన కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్ధను పూర్తిగా ప్రక్షాలనం చేస్తానని ఆయన చెప్పారు. ప్రతి పధకం పేదవాడి ఇంటికి నేరుగా చేరుస్తానని ఆయన అన్నారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తానని ఆయన తెలిపారు. ప్రతి కలెక్టర్ ఏడు అసెంబ్లీ స్థానాలకు జవాబుదారీతనంగా ఉండాలనీ, అందుకు తగినట్లుగా పాలనా వ్యవస్ధలో మార్పులను తెస్తామనీ ఆయన పేర్కొన్నారు.
నవరత్నాల పథకాల అమలుకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తామని ఆయన చెప్పారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే పధకాలను తీసుకువస్తామని ఆయన తెలిపారు.
రైతన్నలకోసం వడ్డీ లేకుండా రుణాలను అందజేస్తామనీ, పగటి పూట తొమ్మిది గంటల పాటు ఉచితంగా ఇస్తామనీ, వ్యవసాయ పెట్టుబడికోసం 12,500 కోట్ల రూపాయలు నేరుగా రైతన్న చేతిలో పెడతామనీ, బోర్లు ఉచితంగా ఇస్తామనీ, పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
మూడు వేల కోట్లతో రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పారు. పంటలకు ముందుగానే కొనుగోలు ధరలను నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. కరవు నివారణకు నాలుగు వేల కోట్ల రిజర్వ్ నిధులను సమకూరుస్తామని ఆయన చెప్పారు. సహకార రంగాన్ని పటిష్టవంతం చేసీ డెయిరీ రంగాన్ని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు.
రాష్ర్టంలోని అన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని జగన్ తెలిపారు.
ప్రతి పేదవాడికి మంచి చేయాలన్నదే తన ధ్యేయమనీ, తాను చనిపోతే ప్రతి ఇంట్లో తన ఫొటో ఉండాలన్న ఆశ తప్ప మరేం లేదని జగన్ చెప్పారు.
previous post
next post