అమరావతి : బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీకి సంబందించిన సీసీటీవి పుణ్యమా అంటూ నిమ్మగడ్డకు వైకాపా శ్రేణులు గుడ్ న్యూస్ చెప్పినట్లు అయింది. హైదరాబాద్ హోటల్ లో సుజనా చౌదరిని నిమ్మగడ్డ కలవడాన్ని.. వైసీపీ నేతలు కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ నిమ్మగడ్డ ఎస్ఈసీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. నిమ్మగడ్డను ఎస్ఈసీగా కొనసాగాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ..రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను కొనసాగించడం ఇష్టం లేక హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే నిమ్మగడ్డ..రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే ప్రభుత్వం అయన పునర్నియామక ఉత్తర్వులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనితో ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీ పదవిలో లేరు అన్నది స్పష్టం అవుతున్నది.g
అయితే సుజనా చౌదరి, కామినేనిలతో నిమ్మగడ్డ రహస్య భేటీ వ్యవహారం బయటకు రావడంతో వైసీపీ శ్రేణులు నిమ్మగడ్డ ప్రస్తుతం ఎస్ఈసీ పదవిలో లేరన్న విషయాన్ని పూర్తిగా మరచిపోయి అయన రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనిలో ఎదో కుట్ర కోణం దాగి ఉందని కూడా ఆరోపించారు. ఎస్ఈసీ లాంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి బీజేపీ ఎంపీని రహస్యంగా కలవడం ఏమిటంటూ వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించడం గమనార్హం. నిమ్మగడ్డను ఎస్ఈసీగా బాధ్యతలు నిర్వహించకుండా తమ ప్రభుత్వం అడ్డుకుందన్న విషయాన్ని మరచి అయన ఎస్ఈసీ హోదాలో ఉన్నట్లుగా వైసీపీ నేతలు విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. నిమ్మగడ్డ ప్రస్తుతం ఎస్ఈసీగా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు. మరో పక్క సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆ భేటీపై నిమ్మగడ్డ వివరణ ఇవ్వాలని కోరారు.