Annaram Barrage: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో కాళేశ్వర ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, అన్నారం బ్యారేజీ లోని రెండు పియర్ల వద్ద బుంగలు ఏర్పడటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ప్రాజెక్టుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో అధికార పార్టీని విమర్శించడం, నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై సంచలన నివేదిక ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై రాష్ట్ర రైతాంగంలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు లోని అన్నారం (సరస్వతి) బ్యారేజ్ లోని గేట్లను ఎత్తివేసి పది రోజులుగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో బ్యారేజీ లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. బ్యారేజీకి సంబంధించి రెండు పియర్ల వద్ద సీపేజీ (బుంగలు) ఏర్పడటంతో అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు తాత్కాలికంగా కట్టడి చేశారు. ఇటీవల కేంద్ర జల సంఘం ఉన్నతాధికారులు ప్రాజెక్టును పరిశీలించారు. నాలుగు రోజులుగా 10,8,7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండగా, ఆదివారం సాయంత్రం ఒక్క గేటు కు పరిమితం చేశారు. దీంతో దిగువకు స్వల్పంగా ప్రవాహం వెళ్లింది. బ్యారేజీకి ఒక వైపు ఇసుక, రాళ్లు తేలాయి. నీటి నిల్వ 1.5 టీఎంసీలు ఉండగా ఇన్ ఫ్లో 2300 క్యూసెక్కులు రాగా దిగువకు 900 క్యూసెక్కులు వదిలారు.
గతంలో ఒక సారి బుంగలు పడటంతో ఢిల్లీ నుండి నిపుణులను రప్పించి వారి సూచనల మేరకు బుంగలను క్లోజ్ చేయించామని అధికారులు చెప్పుకొచ్చారు. దీని వల్ల బ్యారేజీ కి ఎలాంటి ముప్పు లేదని అధికారులు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఇరిగేషన్ అధికారులు ప్రకటించిన 24 గంటల్లోనే నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ కమిటీ ఇచ్చిన నివేదిక వెలుగులోకి వచ్చింది. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లు నిర్మించారని వాటికి కూడా ముప్పు తప్పదని, ఈ రెండు బ్యారేజీలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని అభిప్రాయపడింది.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించకుండానే కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధారిటీ బృందం ఎలా నిర్ధారణ చేస్తారని రాష్ట్ర నీటి పారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేసిఆర్ సర్కార్ ను కావాలనే ఇరుకున పెట్టాలని కుట్ర చేస్తొందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వస్తున్నాయి. అయితే అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్ ను దిగువకు వదులుతుండటంతో సరికొత్త చర్చకు దారి తీస్తొంది. ఓ పక్క విమర్శలను తిప్పికొడుతూనే మరో పక్క అన్నారం బ్యారేజీని ఖాళీ చేస్తుండటంతో వెనుక ఉద్దేశం ఏమిటనే చర్చ జరుగుతోంది. బ్యారేజీ నిజంగానే డ్యామేజీ అయ్యే పరిస్థితి ఉన్నదా లేక మరేదైనా కారణమా అన్న చర్చ మొదలైంది.