Munugode Bypoll Result: హోరా హోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కారు జోరును బీజేపీ నిలువరించలేకపోయింది. కేవలం రెండు రౌండ్ లలో మాత్రమే బీజేపీ అధిక్యత సాధించగా, ఇప్పటి వరకూ జరిగిన 13 రౌండ్ లలో 11 రౌండ్ లలో టీఆర్ఎస్ అభ్యర్ధి కుసుకుంట్ల ప్రభాకరరెడ్డి ఆధిక్యత కనబర్చారు. 13 రౌండ్ లు పూర్తి అయ్యే సరికి బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ పై టీఆర్ఎస్ అభ్యర్ధ ప్రభాకరరెడ్డి దాదాపు 8వేల ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.
టీ ఆర్ఎస్ విజయం ఖరారు కావడం తో తెలంగాణ భవన్ లో సంబరాలు జరుపుకుంటున్నారు. టీ ఆర్ఎస్ విజయకేతనం ఖాయమని తెలియడంతో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ తన ఓటమిని అంగీకరిస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తానని చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో నైతిక విజయం తనదేనని పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అధర్మంగా గెలిచిందని విమర్శించారు. మద్యం, డబ్బు పంపిణీ చేసి టీఆర్ఎస్ పార్టీ గెలిచిందనీ, డబ్బు పంపిణీకి పోలీసులే సహకరించారని ఆరోపించారు కోమటిరెడ్డి.
మునుగోడు నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరించిందని రాజగోపాల్ ఆరోపించారు. తమను కనీసం ప్రచారం కూడా చేసుకోనివ్వలేదని అన్నారు. దేశ చరిత్ర లో తొలి సారి రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేశారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలను ప్రలోభాలకు గురి చేశారని తెలిపారు. అవినీతి సొమ్ముతో అడ్డదారులు తొక్కి ఈ విజయం సాధించారని విమర్శించారు. అయినప్పటికీ ప్రజల పక్షాన తన పోరాటం కొనసాగుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ అన్నారు.