Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కమిషన్ కీలక కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మూడవ శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నర్ తమిళిసై కి ఈ గెజిట్ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి అందజేశారు. అలానే ఎన్నికలపై నివేదిక కూడా గవర్నర్ కు అందజేశారు. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళిసైకి సీఈవో వికాస్ రాజ్ అందించారు.
మరో పక్క ప్రస్తుత శాసనసభను గవర్నర్ తమిళి సై రద్దు చేశారు. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశారు. అసెంబ్లీ రద్దు ప్రతులను అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి గవర్నర్ కు అందజేశారు. కాగా కొత్త ప్రభుత్వం ఈ రాత్రికే ఏర్పాటు అవుతుందని అందరూ భావించారు. రాత్రి 8.30 గంటలకు సీఎంగా రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని వార్తలు రావడంతో కొత్త మంత్రుల కోసం అధికారులు వాహనాలను సిద్దం చేశారు. దిల్ కుష అతిధి గృహానికి వాహనాలను తీసుకువచ్చారు. కొత్త ప్రభుత్వానికి తగిన విధంగా సచివాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీఏడీ ఛాంబర్ లు సిద్దం చేస్తొంది. అధికారులు పాత బోర్డులను తొలగించారు. ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను సిబ్బంది ఖాళీ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో మీడియాకు ప్రత్యేక గది కేటాయించారు.
అయితే సీఎల్పీ నేత ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో సీఎం, డిప్యూటి సీఎం ప్రమాణ స్వీకారం ఈరోజు లేనట్టేనని అంటున్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు డీకే శివకుమార్ సహా ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీకి పయనమై వెళ్లారు. పలువురు సీనియర్ నేతలు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలని ఏఐసీసీ పరిశీలకుల వద్ద తమ అభిప్రాయాలను చెప్పడంతో ఈ అంశంపై పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు పరిశీలకులు ఢిల్లీకి వెళ్లారు. ఈ పరిణామంతో ఈ నెల 6వ తేదీ లేదా 9వ తేదీ సీఎం ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.