Michaung Cyclone: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడిన మిచౌంగ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చుపుతోంది. తుఫాను కారణంగా ఏపితో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైకి 90 కిలో మీటర్లు, నెల్లూరుకు 140 కిలో మీటర్లు..బాపట్లకు 250 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుఫాను రేపు ఉదయం బాపట్ల, మచిలీపట్నం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలోని అన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఇవేళ రాత్రి కుండపోత గా వర్షం కురుస్తుందని తెలిపింది. నెల్లూరు నుండి కాకినాడ వరకూ కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తుఫానుపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తుఫాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. చెన్నై విమానాశ్రయంలోకి బారీగా వర్షపు నీరు చేరుకుంది. దీంతో పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. తమిళనాడులో వర్ష బీభత్సానికి వరద నీటిలో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తీరాన్ని దాటిన తర్వాత తీవ్ర తుఫాను నుండి తుఫానుగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం అర్ధరాత్రికి మరింత బలహీనపడి వాయుగుండంగా మరే సూచనలు ఉన్నాయి. తీవ్ర తుఫాను కోస్తాంధ్ర తీరానికి అత్యంత చేరువగా రావడంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీవర్షాలు, గాలులతో తుఫాను విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు తీర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో అలజడి నెలకొని భరీ నుండి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, సూళ్లురుపేట, ఒంగోలు, కొవ్వూరు, చీరాల, మచిలీపట్నం, ఆవనిగడ్డ, రేపల్లే మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు సముద్రపు నీరు చొచ్చుకువచ్చే అవకాశం ఉంది. తీవ్ర తుఫాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుండి అతి భారీవర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుండి విస్తారంగా వర్షాలు పడనున్నాయని పేర్కొంది.
భారీ వర్షాల కారణంగా ఏపీలోని తుఫాను ప్రభావిత జిల్లాల్లో ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ .. ఎనిమిది జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర ఖర్చుల నిమిత్తం ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాలకు రెండు కోట్ల చొప్పున నిధులు విడుదల చేసినందున జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ లపై ఉందని అన్నారు. పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకుడదని అన్నారు. ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపై దృష్టి పెట్టాలని చెప్పారు.