Telangana Governor Tamilisai: తెలంగాణలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని పేర్కొన్నారు.
ప్రజాకవి కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళి సై.. దాసరథి సూక్తులతో ముగించారు. అయితే ప్రభుత్వ ప్రసంగంలో పలు అంశాలను గవర్నర్ దాట వేశారు. 2014 లో తెలంగాణ ఏర్పాటునకు కృషి చేసిన యూపీఏ ప్రభుత్వానికి, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపే పేరాను గవర్నర్ తమిళి సై చదవలేదు. పదేళ్ల నిర్బంధ పాలనలో తెలంగాణ ప్రజలకు విముక్తి కల్గిందన్నారు. మార్పు పలాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తొందర్లోనే అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్లు అప్పుల్లో ఉందన్నారు. 50వేల 275కోట్ల నష్టంలో విద్యుత్ సంస్థలు కొనసాగుతున్నాయని, పౌరసరఫరాల శాఖ రూ.56 వేల కోట్లు అప్పుల్లో ఉందన్నారు. గాడితప్పిన ఆర్ధిక వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్వరలో శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయనున్నట్లు చెప్పారు.
గడిచిన తొమ్మిదన్నరేళ్లలో చాలా సంస్థలు విధ్వంసానికి గురయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు వ్యక్తుల కోసం పని చేశాయని అన్నారు. కార్యనిర్వహణ వ్యవస్థలో విలువలను పునరుద్దరిస్తామని చెప్పారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తమ ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తుందని పేర్కొన్నారు. అణచివేతకు, వివక్షకు గురైన ప్రతి వర్గానికి తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందన్నారు. గ్రామీణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అయ్యిందని అన్నారు. ప్రతి గ్రామ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ తెస్తామని హామీ ఇచ్చామని, కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజా వాణి చేపట్టామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామన్నారు. తమ జీవితాల్లో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఇది సామాన్యుడి ప్రభుత్వమని గర్వంగా చెప్పే పరిస్థితి ఉందన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ఈ రాష్ట్రంలో మా పాలన దేశానికి ఆదర్శం కాబోతుందన్నారు. అమరవీరుల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని పాలన సాగిస్తామని చెప్పారు.
స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి సభావేదికగా నివాళి అర్పిస్తున్నామన్నారు. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం..గౌరవ భృతి ఇస్తామని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని, రెండు లక్షల రుణ మాఫీపై త్వరలోనే కార్యాచరణ సిద్దం చేస్తామన్నారు. అసైన్డ్, పోడు భూములకు త్వరలోనే పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని తెలిపారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ శనివారానికి వాయిదా పడింది.
KCR: ఆసుపత్రి నుండి కేసిఆర్ డిశార్చ్ .. రేపటి నుండి పరామర్శలు