Huzurabad By Poll: హూజూరాబాద్ ఉప ఎన్నిక పోరులో టీఆర్ఎస్ – బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలబడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ పోటీ టీఆర్ఎస్ – బీజేపీ అనే కంటే కేసిఆర్ – ఈటల వర్సెస్ పోటీ అనడం సమంజసం. ఈ ఎన్నిక కేసిఆర్, ఈటల రాజేందర్ కు ప్రతిష్టాత్మకం. అందుకే కేసిఆర్ ఎలాగైనా ఈటలను గట్టి తీయడం కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నారు. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావుకు పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పలువురు మంత్రులు రంగంలోకి దిగి టీఆర్ఎస్ గెలుపునకు తమ వంతు కృషి చేస్తున్నారు. నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. బీజేపీ తరపున ఈటల రాజేందర్ దాదాపు ఫిక్స్ అయినట్లు ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తుండగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను కేసిఆర్ ప్రకటించారు. అయితే ఇంత వరకూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు.
టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కన్నా టీఆర్ఎస్ ఓడిపోవడం ప్రధానం. అందుకే అంత సీరియస్ గా తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ (బహిష్కరణకు గురైన) ని వీడీ టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి..ఈటల, రేవంత్ రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల, రేవంత్ రెడ్డి మధ్య రహస్య ఒప్పందం జరిగిందనీ, ఈటల రహస్యంగా రేవంత్ రెడ్డిని కలిసి తనకు సహకరించాలని కోరారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఈటల ప్యాకేజీ ఇచ్చారనీ కౌశిక్ రెడ్డి ఆరోపిస్తూ అందుకే హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఊసే లేకుండా పోయిందన్నారు. బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఈటల గెలుపునకు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉప ఎన్నికలు వాయిదా పడటంతో బీజేపీ, టీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు నడుస్తున్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్నికలు జరిగితే అధికార టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం కష్టమని ఇంటెలిజెన్స్ సర్వే ద్వారా కేసిఆర్ కు అర్థం అయ్యిందనీ, అందుకే కరోనా, ఉత్సవాలు సాకుగా చూపి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉప ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరిందనీ, ప్రధాన మంత్రి మోడీని సీఎం కేసిఆర్ కలిసిన తరువాతే ఎన్నికల సంఘం దీనిపై ప్రకటన వచ్చిందని అంటున్నారు. గుజరాత్ లో ఉప ఎన్నికలకు కరోనా, ఉత్సవాలు అడ్డురానప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికకు ఉత్సవాలు, కరోనా సాకుగా చూపడాన్ని తప్పుబడుతున్నారు. మరో పక్క ఉప ఎన్నికలు వాయిదా పడటంపై కేసిఆర్ సర్కార్ పై బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా పరిస్థితులు ఉంటే ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం కోరి ఉండేది కాదని ఆ పార్టీల నేతలు అంటున్నారు. టీఆర్ఎస్, రేవంత్ రెడ్డిలపై వస్తున్న విమర్శలకు వారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Read More:
1.MAA Elections: బండ్ల గణేష్ బిగ్ ట్విస్ట్..షాక్ లో ప్రకాష్ రాజ్ ప్యానల్
2.MP Komatireddy: కాంగ్రేస్ ఎంపి కోమటిరెడ్డిపై క్రమశిక్షణా చర్యలు..?
3.YS Sharmila: తెలంగాణలో సీఎం కేసిఆర్ అసలు లక్ష్యాన్ని బయటపెట్టిన వైఎస్ షర్మిల..!!