KCR: గత కొద్దికాలంగా దళిత సంక్షేమం గురించి ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో విమర్శలు సైతం లైట్ తీసుకున్న సంగతి తెలిసిందే. హుజురాబాద్ లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు గురించి విమర్శలు వచ్చినప్పటికీ కేసీఆర్ తిప్పికొడుతున్నారు. తాజాగా ఆయన మరో సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ తో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు ప్రగతిభవన్ కు తరలివచ్చారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దళితులకు ఇంకో వరం ప్రకటించారు.
Read More : KCR: హుజురాబాద్లో కేసీఆర్ కొత్త ఆపరేషన్ ఏంటో తెలుసా?
లక్ష కోట్లైనా ఖర్చుకు రెడీ
అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని హామీ ఇచ్చారు. దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సంచలన ప్రకటన చేశారు. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్ధిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతోందన్నారు కేసీఆర్ . అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలంటూ.. దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.
Read More : KCR: కేసీఆర్ పాలనపై షర్మిల సెటైర్లు
దరఖాస్తులకు ప్రత్యేక యాప్
తెలంగాణ లో ఎస్సీల ఆర్థిక సాధికారత కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సంస్థకు బాధ్యతలు అప్పగించింది. వెబ్ పోర్టల్ తోపాటు యాప్ను ఈ నెలాఖరులోగా సిద్ధం చేసి ఆగస్టు తొలి వారానికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సీజీజీకి సూచించింది. దళిత బంధు పథకం కింద నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున స్వయం ఉపాధి పథకాల కోసం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందని వారిని తొలి ప్రాధాన్యం కింద గుర్తించాలని, ఆ తర్వాత కేటగిరీల వారీగా అర్హులను ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం 119 నియోజకవర్గాలలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. రైతుబంధు మాదిరే సాయాన్ని ఎంపికైన కుటుంబాల పేరిట నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. రైతుబంధు తరహాలోనే ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు కేసీఆర్ తెలిపారు.