తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మధ్యనున్న రాజకీయ విమర్శల పర్వం గురించి పరిచయం చేయనవసరం లేదు. విమర్శలు ప్రతి విమర్శలతో వీరిద్దరి రాజకీయం ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
అయితే, తాజాగా తన చేతల ద్వారా రేవంత్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ షాకిచ్చారు. రేవంత్ రెడ్డి ఇలాకా అయిన కొడంగల్ కు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.
అటు నుంచి నరుక్కువచ్చిన కేసీఆర్
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి నియోజకవర్గ సమస్యలు వివరించారు. దీంతో నియోజకవర్గానికి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. కొత్త మండలాలుగా 1) దుద్యాల్ 2)గుండుమల్ 3). కొత్తపల్లి ఏర్పాటు చేస్తూ సీఎస్ సోమేష్ కుమార్ కు ఆదేశాలిచ్చారు. బొమ్మరాస్ పేట, దౌలతాబాద్ మండలాలకు కొత్త ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. అలానే కొడంగల్ నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నందున కొడంగల్ నియోజకవర్గంలో బంజారాభవన్ ఏర్పాటుకు నిధులు వెంటనే అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.
అక్కడితోనే అయిపోలేదు…
కొడంగల్ నియోజకవర్గం కోసం మంజూరై పలు కారణాలతో వివిధ ప్రాంతాలలో నడుస్తున్న గురుకులాలను ఇక వెంటనే కోడంగల్ కు తరలించాలని కూడా సీఎం కేసీఆర్ ఆదేశించారు. అంతే కాక త్వరలో కోస్గి డిపోకు మరిన్ని నిధులు అందిస్తూ ప్రారంభోత్సవ నిర్వహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల బిల్లులు చెల్లిస్తామని, ఆస్పత్రులు ప్రారంభం చేసేలా చూడాలన్నారు. కోస్గి మున్సిపాలిటీ ఆధునీకరణ లో భాగంగా రూ.10 కోట్లతో కోస్గి – సజ్జకాన్ పేట రోడ్డు విస్తరణ చేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎంఎల్ఏ పట్నం నరేందర్ రెడ్డి ధన్యవాదాలు సీఎం కేసీఆర్ కు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ ఆశ్చర్యకర వరాల జల్లుపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.