Amit Shah – Pawan Kalyan: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీ – జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటు పై అమిత్ షాతో పవన్ కళ్యాణ్ చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఏపీలో బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో పొత్తు ప్రకటన చేసిన తర్వాత అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ కావడం దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే వీరి భేటీలో తెలంగాణ ఎన్నికలకు సంబందించి మాత్రమే చర్చ జరిగిందా.. ఏపీ విషయాలపైనా చర్చించారా అనేది తెలియరాలేదు. పొత్తులో భాగంగా తెలంగాణ లో 20 స్థానాల వరకూ జనసేన డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పది నుండి 12 స్థానాలు కేటాయించేందుకు సుముఖంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండటంతో జనసేన తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం సూచనల మేరకు అటు ఇటుగా సీట్ల కేటాయింపునకు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
రెండు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ను కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు కలిసి తెలంగాణ ఎన్నికల్లో జనసేన మద్దతును కోరారు. ఈ సందర్భంలో తమ పార్టీ క్యాడర్ పలు స్థానాల్లో పోటీకి సిద్దంగా ఉన్నట్లు పవన్ వారికి తెలియజేశారు. జనసేనతో సీట్ల సర్దుబాటు నేపథ్యంలో బీజేపీ అభ్యర్ధుల రెండో జాబితా ఆలస్యం అయ్యింది.
ఈ నెల 27వ తేదీన అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంలోనే అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే ఢిల్లీ నుండి పిలుపు రావడంతో కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కాగా తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి.
Komatireddy Rajagopal Reddy: బీజేపీకీ కటీఫ్ చెప్పిన కోమటిరెడ్డి .. మరల కాంగ్రెస్ గూటికి ..